డాలర్ మారకంతో 79 సమీపానికి రూపాయి, పెట్టుబడులు సహా కారణాలివే
డాలర్ మారకంతో రూపాయి మంగళవారం (28 జూన్ 2022) భారీగా పతనమైంది. నిన్న 78.53 వద్ద బలహీనంగా ప్రారంభమైన భారత కరెన్సీ చివరకు 48 పైసలు క్షీణించి ఆల్ టైమ్ కనిష్టం 78.85 వద్ద ముగిసింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు వెల్లువెత్తడం రూపాయి పతనానికి ప్రధాన కారణం. దీనికి తోడు ముడి చమురు ధరలు పెరగడం ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈక్విటీ మార్కెట్ బలహీనంగా ఉండటం రూపాయి పతనానికి కారణాలు.
రూపాయి భారీ పతనం నేపథ్యంలో కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఇలాంటి సందర్భాల్లో ఆర్బీఐ రంగంలోకి దిగేది. ఈసారి అలాంటి చర్యలు ప్రస్తుతానికి ఆర్బీఐ చేపట్టడం లేదని, అందుకే రూపాయి రోజురోజుకు బలహీనపడుతోందని విశ్లేషకులు అంటున్నారు.
ఈ ఏడాది ఇప్పటివరకు FPIలు స్టాక్ మార్కెట్ నుండి 28 బిలియన్ డాలర్లకు పైగా వెనక్కి తీసుకున్నారు. బ్రెంట్ క్రూడ్ ధర గత కొద్దిరోజులుగా 105 డాలర్ల నుంచి 115 డాలర్ల స్థాయికి చేరింది. దీంతో భారత కరెన్సీపై ఒత్తిడి పడిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ కఠిన వైఖరి, ఈక్విటీల్లో FPIల అమ్మకాలతో కేవలం 6 రోజుల్లో రూపాయి 100 పైసల భారీ నష్టాన్ని నమోదు చేసిందని చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే డాలర్ మారకంతో రూపాయి 79కి చేరుకోవచ్చునని అంటున్నారు.