రూపాయి ఎందుకు పతనమైంది? మనపై ప్రభావం ఎంత, అవి పెరుగుతాయి
అమెరికా డాలర్ మారకంతో రూపాయి క్రితం సెషన్లో దారుణంగా పతనమైంది. ముడి చమురు ధరల కారణంగా ఇప్పటికే అన్ని ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. రూపాయి మారకపు వ్యాల్యూ క్షీణిస్తే రోజువారీ ఖర్చులు మరింత పెరుగుతాయి. ఈ ఏడాది ప్రారంభం నుండి బలహీనంగా ఉన్న రూపాయి సోమవారం డాలర్ మారకంతో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్టం 77.52కు చేరుకుంది. చివరకు స్వల్పంగా కోలుకొని 77.44 వద్ద ముగిసింది. పరిస్థితి ఇలాగే ఉంటే డాలర్ వ్యాల్యూతో రూపాయి 80కి చేరుకోవచ్చునని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకు డౌన్?
అంతర్జాతీయంగా కీలక కరెన్సీలలో డాలర్ వ్యాల్యూ అంతకంతకూ పెరుగుతుండటంతో రూపాయి బలహీనమవుతోంది. ఇప్పుడు ఆల్ టైమ్ కనిష్ఠానికి పతనమైంది. డాలర్కు పెరుగుతున్న డిమాండ్, దేశీయ మార్కెట్ల నుండి తరలిపోతున్న విదేశీ మదుపరుల పెట్టుబడులు రూపాయికి ఇబ్బందికరంగా మారాయి.
వీటికి తోడు అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుదల, ఆసియా సహచర కరెన్సీ బలహీనత ప్రభావం చూపుతోంది. అమెరికా వడ్డీ రేట్ల పెంపు ఈక్విటీ మార్కెట్లను కూడా అనిశ్చితికి, బలహీనతకు గురి చేస్తోంది. రూపాయి అంతకుముందు ముగింపుతో పోలిస్తే క్రితం సెషన్లో 54 పైసలు క్షీణించి 77.44 వద్ద ముగిసింది. దేశీయ మార్కెట్ నుండి తరలిపోతున్న విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూపాయిని నష్టాల్లోకి నెడుతున్నాయి.
రూ.80కి చేరవచ్చు
పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలో 80కి పడిపోవచ్చునని అంటున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఈక్విటీ పతనం నేపథ్యంలో డాలర్ మారకంతో రూపాయి మార్చి 8న 77.05ను తాకింది. నిన్నటి వరకు ఇది ఆల్ టైమ్ కనిష్టం. ఆ తర్వాత రూపాయి బలపడినా రెండు నెలలకే తిరిగి పతనమైంది. 2020 ఏఫ్రిల్ 22న కరోనా కారణంగా 76.92కు పడిపోయింది.
80 శాతం దిగుమతులే
రూపాయి బలహీనపడితే మనం దిగుమతి చేసుకునే వస్తువులకు అధిక మొత్తం చెల్లించవలసి వస్తుంది. దేశీయ అవసరాలకు కావాల్సిన ముడి చమురులో 80 శాతం దిగుమతులే. ఇప్పటికే ముడి చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రవాణా ఖర్చులు పెరిగి, మరికొన్ని ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఇప్పుడు రూపాయి వ్యాల్యూ క్షీణత వల్ల పెట్రోల్ ధరలు మరింత పెరిగి ధరలపై ప్రభావం పడుతుంది. రవాణా వ్యయం భారమవుతుంది. ద్రవ్యోల్భణంతో రేట్లు పెరుగుతాయి. దీంతో నెలవారీ ఈఎంఐలు భారమవుతాయి.