రూపాయి ట్రేడింగ్లో ముంబైని దాటిన లండన్, RBI కీలక నిర్ణయం
ముంబై: రూపాయి ట్రేడింగ్ సేవలు ఇకపై 24 గంటలు అందుబాటులో ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు తీసుకుంటోంది. ఇక నుంచి బ్యాంకులు రౌండ్ ది క్లాక్ ఫారన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ సేవలు అందించేందుకు పచ్చజెండా ఊపింది. అంటే రోజంతా కరెన్సీ ట్రేడింగ్ సేవలు అందించుకోవచ్చు.
కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే మీకోసమే ఈ టిప్స్...
రూపాయి ట్రేడింగ్ పరిమాణం అక్కడే ఎక్కువ
రూపాయి ట్రేడింగ్ పరిమాణం భారత్లో కంటే విదేశాల్లో ఎక్కువగా జరుగుతుండటం, ట్రేడింగ్ వేళలు పరిమితంగా ఉండటంతో అంతర్జాతీయ పరిణామాలను దేశీయ మార్కెట్లు వెంటనే అందిపుచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
ఎప్పుడైనా..
ఇంటర్ బ్యాంక్ డీల్స్ వేళల తర్వాత కూడా భారత్ వెలుపల ఉన్న వినియోగదారులతో, విదేశీ శాఖలు లేదా యూనిట్లతో ఎప్పుడైనా చేసుకోవచ్చునని ఆర్బీఐ తన ప్రకటనలో తెలిపింది. కాగా, ఆర్బీఐ ఆదేశాలు ఓవర్ ది కౌంటర్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్కే పరిమితమైనా ఎక్స్చేంజీలో కూడా కరెన్సీ ట్రేడింగ్ వేళలు పొడిగించేందుకు ఇది బాటలు వేయనుందని అంటున్నారు. ఇందుకు సంబంధించి సెబి ఉత్తర్వులివ్వాలి.
ముంబైని దాటిన లండన్
రూపాయి ట్రేడింగ్లో లండన్ ముంబైని ఇటీవల అధిగమించింది. లండన్ అగ్రస్థానంలో నిలిచింది. బ్యాంక్ ఆప్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ గణాంకాల ప్రకారం ప్రతి రోజు సగటున యూకేలో 2016లో 8.8 బిలియన్ డాలర్ల ట్రేడింగ్ ఉంటే, గత ఏడాది ఏప్రిల్ నాటికి ఇది ఐదు రెట్లు పెరిగి 46.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది భారతదేశంలో నమోదైన 34.5 బిలియన్ డాలర్లను దాటేసింది. వాస్తవానికి కరెన్సీ ట్రేడింగ్ సమయం పొడిగించాలనే డిమాండ్ ఎంతోకాలంగా ఉంది. భారత్లో కంటే ఇతరత్రా కొన్ని దేశాల్లో రూపాయి ట్రేడింగ్ భారీగా ఉంటుండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.