రూ.2,000 కథ ముగిసినట్లే? ATMలో క్యాసెట్ తొలగింత, బ్యాంకుల ప్రకటన!
రూ.2,000 నోట్లు క్రమంగా కనుమరుగవుతున్నాయా? ATM కేంద్రాల్లో డబ్బులు విత్ డ్రా చేసినప్పుడు రూ.2,000 నోట్ల కంటే రూ.500 నోట్లే ఎక్కువగా వస్తున్నాయా? అంటే అవుననే అంటున్నారు. బ్యాంకులు తమ ఏటీఎంలలో ఎక్కువగా రూ.500 నోట్లు ఉంచుతున్నాయని, రూ.2,000 నోట్లు ఉంచడం లేదని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ట్రంప్కు హామీపై మోడీ వెనుకడుగు! భారీ ఒప్పందాలకు ఇండియా నో?
రూ.2,000 నోట్లు వెనక్కి దిశగా సంకేతాలు..
ఏటీఎం కేంద్రాల్లో రూ.2,000 నోట్లకు బదులు ఎక్కువగా రూ.500 నోట్లు ఉంచడం ద్వారా అధిక విలువ కరెన్సీ నోట్లను క్రమంగా వెనక్కి తీసుకోవడానికి ఇది సంకేతమని చెబుతున్నారు. సమాచార హక్కు చట్టం కింద అఢిగిన ప్రశ్నకు గత ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సమాధానం ఇస్తూ రూ.2,000 నోట్ల ప్రింటింగ్ను నిలిపివేసినట్లు చెప్పిన విషయం కూడా తెలిసిందే.
చలామణి తగ్గింపు..
ప్రధాని మోడీ నాలుగేళ్ల క్రితం రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయడంతో కొత్త రూ.500, రూ.2000 నోట్లు తీసుకు వచ్చారు. అయితే నాటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా అధిక వ్యాల్యూ కలిగిన రెండు వేల నోట తెచ్చారు. ఇప్పుడు వీటి చలామణిని క్రమంగా తగ్గిస్తున్నారని తెలుస్తోంది.
రూ.2000 క్యాసెట్లు తొలగింత
ఏటీఎం మిషన్లలోని నోట్లు నింపే నాలుగు క్యాసెట్లలో మూడింట్లో రూ.500 నోట్లు, నాలుగో దానిలో రూ.100 లేదా రూ.200 నోట్లు ఫిల్ చేస్తున్నారు. చాలా ఏటీఎం కేంద్రాల్లో రూ.2,000 క్యాసెట్ను తొలగించారు. ఇతర ఏటీఎంలలో కూడా క్రమంగా దీనినే అనుసరించనున్నారు.
మార్చి 1 నుంచి ఈ బ్యాంకు ఏటీఎంలో బంద్
తమ ఏటీఎం మిషన్లలో రూ.2000 నోట్లు పెట్టడాన్ని బ్యాంకులు క్రమంగా ఆపివేస్తున్నాయి. మార్చి 1 నుంచి తమ ఏటీఎంలలో రూ.2,000 నోట్లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. ఇతర బ్యాంకులు కూడా ఇందుకు సిద్ధమవుతున్నాయి.
బ్రాంచీల్లో ఓకే..
తమ బ్రాంచీల్లో మాత్రం బ్యాంకులు రూ.2,000 నోట్లను తీసుకోవడం, ఇవ్వడం చేస్తున్నాయి బ్యాంకులు. ఆర్బీఐ నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. కానీ ఖాతాదారుల సౌలభ్యం కోసం ఈ పని చేస్తున్నట్లు చెబుతున్నాయి. ఆర్థిక శాఖ ఆదేశాలు కూడా లేనప్పటికీ బ్యాంకులు తమకు తాముగా ఏటీఎంలలో తక్కువ విలువ కలిగిన నోట్లతో నింపుతున్నాయట.
అప్ గ్రేడ్ కారణాలు...
నిజానికి రూ.2,000 నోట్లను ఏటీఎంల్లో నింపడానికి వాటిని కొంత అప్ గ్రేడ్ చేయాల్సిన పరిస్థితులు. వ్యయం పరంగా ఇది బ్యాంకులపై అదనపు భారాన్ని మోపుతోంది. రూ.2,000 నోట్లను ఏటీఎంలలో తగ్గించడానికి ఇది కూడా కారణంగా చెబుతున్నారు.
అందుకే వ్యవస్థ నుండి తగ్గిస్తున్నారు
ఎక్కువ వ్యాల్యూ కలిగిన నోట్ల అక్రమ నిల్వ, నల్లధనం నిరోధం లక్ష్యంగా రూ.2,000 నోటును వ్యవస్థ నుంచి క్రమంగా తగ్గిస్తున్నట్లుగా భావిస్తున్నారు.
భారీగా తగ్గిన ముద్రణ
ఆర్టీఐ ద్వారా అడిగిన ఓ ప్రశ్నకు ఆర్బీఐ ఇచ్చిన సమాచారం మేరకు.. 2016-17లో రూ.2,000 నోట్లను 3,542.991 మిలియన్లు ముద్రించగా, 2017-18లో ఈ సంఖ్య 111.507కు తగ్గింది. 2018-19లో అయితే 46.690 మిలియన్లకు తగ్గింది. ఈ లెక్కన ఆర్బీఐ రూ.2000 నోట్లను క్రమంగా వెనక్కి తీసుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయని భావిస్తున్నారు. దేశంలో చలామణిలో ఉన్న ద్రవ్యనోట్లలో రూ.2,000 నోట్ల శాతం తగ్గుతోంది. 2016-17లో చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో రూ.2,000 నోట్ల వాటా 3.3 శాతం కాగా 2018-19కి వచ్చే సరికి ఇది 3 శాతానికి పడిపోయింది.
ప్రతిపాదన లేదు..
రూ.2,000 నోట్లను ఉపసంహరించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కొద్ది నెలల క్రితం ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పార్లమెంట్ ప్రశ్నోత్తరాల సందర్భంగా స్పష్టం చేశారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన తెలిపిన సమాచారం ప్రకారం... చలామణీలో ఉన్న నోట్ల వ్యాల్యూ 2016 నవంబర్ 4న రూ.17,74,187 కోట్లు కాగా 2019 డిసెంబర్ 2 నాటికి రూ.22,35,648 కోట్లుగా ఉంది. రూ.2000 నోట్లను ఉపసంహరించే ప్రతిపాదన లేకపోయినా క్రమంగా తగ్గించడం గమనార్హం.