ముఖేష్ అంబానీ మరో సంచలనం, చైనా కంపెనీలకు హెచ్చరిక: రూ.4,000కే జియో స్మార్ట్ఫోన్!
టెలికం రంగంలో నాలుగేళ్లుగా కొత్త ఒరవడి సృష్టిస్తున్న రిలయన్స్ జియో మరో సంచలనానికి సిద్ధమైంది. తక్కువ ధరకే మొబైల్ ఫోన్లు తీసుకురానుంది. ఈ మేరకు లోకల్ సరఫరాదారులతో మాట్లాడిందని తెలుస్తోంది. జియో ద్వారా మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్ నాలుగేళ్లలోనే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్న టాప్ టెల్కోగా నిలిచింది. వాయిస్ కాల్స్, డేటా సహా అన్నింటా ధరల యుద్ధానికి దిగి మార్కెట్ను పెంచుకుంది. ఇప్పుడు అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్స్ అందించి భారత టెలికం మార్కెట్లో మరింత పట్టు సాధించాలని భావిస్తోంది ముఖేష్ అంబానీకి చెందిన కంపెనీ.
రుణగ్రహీతలకు SBI గుడ్న్యూస్, ఆన్లైన్ అర్హత నిర్ధారణ: ఎలా చెక్ చేసుకోవాలి?
రూ.4,000కు స్మార్ట్ ఫోన్
గతంలోనే స్మార్ట్ ఫోన్లను విక్రయించిన రిలయన్స్ జియో ఇప్పుడు రూ.4వేలకు స్మార్ట్ ఫోన్ తీసుకు రానుంది. ఇందుకోసం దేశీయ మొబైల్ తయారీ సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. దేశీయంగా తయారవుతున్న స్మార్ట్ ఫోన్లలో అయిదోవంతు రూ.7,000 లోపువి అని అంచనా. ఇప్పుడు దాదాపు రూ.4,000 ధరలోనే స్మార్ట్ ఫోన్ను తెచ్చేందుకు ఇక్కడి ఫోన్ మేకర్లతో కలిసి పని చేస్తోందట. రాబోయే రెండేళ్లలో 20 కోట్ల స్మార్ట్ ఫోన్లను అందించే విధంగా, తయారీ సామర్థ్యం పెంచుకోవాలని లోకల్ ఫోన్ మేకర్స్ను కోరుతున్నట్లుగా తెలుస్తోంది.
గూగుల్ పెట్టుబడులు.. చైనా కంపెనీలకు హెచ్చరిక
అందుబాటులో ధరలు ఉండేలా స్మార్ట్ ఫోన్ తయారీ ప్రాజెక్టు కోసం రిలయన్స్ జియోలో గూగుల్ పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. గూగుల్ ఆండ్రాయిడ్ సాఫ్టువేర్తో జియో స్మార్ట్ ఫోన్లు పని చేస్తాయి. రిలయన్స్ జియో నెలవారీపథకాలతో అనుసంధానం చేసి, వీటిని విక్రయిస్తారు. ప్రస్తుతం భారత్లో అమ్ముడయ్యే స్మార్ట్ ఫోన్లలో టాప్ 5 కంపెనీల్లో 4 చైనాకు చెందినవే. షావోమీ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ మొబైల్స్ తక్కువ ధరకు రావడంతో ఎక్కువ మంది కొనుగోలుకు మొగ్గు చూపుతారు. ఇలాంటి సంస్థలకు జియో నుండి ఇది హెచ్చరికే.
దేశీయ తయారీ సంస్థలకు ఊతం
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్కు ప్రాధాన్యం ఇస్తోన్న విషయం తెలిసిందే. దేశీయ దిగ్గజ కంపెనీలు కూడా స్థానికంగా ఉత్పత్తుల ప్రోత్సాహానికి ఇటీవల ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉదాహరణకు ఆటో మొబైల్ కంపెనీలు సాధ్యమైనంతగా చైనా ఉత్పత్తులు తగ్గించి, దేశీయ తయారీదారులను ప్రోత్సహించాలని భావించింది. జియో కూడా తమ తక్కువ ధర మొబైల్ ఫోన్ల ద్వారా దేశీయ తయారీ సంస్థలకు ఊతమివ్వాలని భావిస్తోంది. రానున్న రెండేళ్లలో 20 కోట్ల మేర స్మార్ట్ ఫోన్లను విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. భారతీ ఎయిర్టెల్ కూడా 4G ఫోన్ తయారీ కోసం స్థానిక అసెంబ్లింగ్ యూనిట్లతో చర్చలు జరుపుతోందట.
దీపావళి సమయానికే..
నెలకు 50 లక్షల వరకు ఫోన్లు జియో చందాదారులకు సరఫరా చేయాల్సి ఉటుందనే అంచనాలు ఉన్నాయి. దీపావళి పండుగ సమయానికే జియో రూ.4000 స్మార్ట్ ఫోన్లు మార్కెట్కు రానున్నాయని అంచనా. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో పదహారున్నర కోట్ల సెల్ ఫోన్లు తయారయ్యాయి. అంతే సంఖ్యలో బేసిక్ ఫీచర్ ఫోన్లు తయారయ్యాయి. తక్కువ ధర మొబైల్ వస్తే టెలికం మార్కెట్ పైన ముఖేష్ అంబానీ కంపెనీ మరింత పట్టు సాధిస్తోంది.