రూ.2,000 నోట్ల చలామణి 223.3 కోట్లకు తగ్గింది, రెండేళ్లుగా ముద్రణ లేదు
రూ.2000 కరెన్సీ నోట్ల సర్క్యులేషన్ ఈ ఏడాది నవంబర్ నాటికి 223.3 కోట్లకు తగ్గిందని ప్రభుత్వం వెల్లడించింది. 2018 నవంబర్ నాటికి ఈ నోట్ల సంఖ్య 336.3 కోట్లుగా ఉంది. మొత్తం చలామణిలో ఉన్న కరెన్సీలో వీటి పరిమాణం 1.75 శాతం. రూ.500, రూ.1000 పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.2వేల నోట్లను తీసుకు వచ్చినప్పటికీ, వీటిని క్రమంగా ఆర్బీఐ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా రెండేళ్లుగా వీటి ముద్రణ నిలిపివేసింది. నోట్ల చలామణిని కూడా తగ్గిస్తోంది.
2018 మార్చి 31వ తేదీ నాటికి దేశంలో 336.3 కోట్ల రూ.2,000 నోట్లు చలామణీలో ఉన్నాయని, అయితే 2021 నవంబర్ 26వ తేదీ నాటికి వాటి సంఖ్య 223.3కోట్లకు తగ్గిందని, 2018 మార్చిలో అప్పటికి చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో వీటి పరిమాణం 3.27 శాతం కాగా, ఇప్పుడు 1.75 శాతానికి పడిపోయిందని, అలాగే మొత్తం కరెన్సీ వ్యాల్యూలో రూ.2,000 నోట్ల వ్యాల్యూ 37.26 శాతం నుండి 15.11 శాతానికి తగ్గిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
ప్రజల ద్రవ్య ట్రాన్సాక్షన్స్ డిమాండ్కు అనుగుణంగా కరెన్సీ నోట్లను చలామణీలో ఉంచేందుకు ఎంత వ్యాల్యూ గల నోట్లను ముద్రించాలనే దానిపై ఆర్బీఐతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 2018-19 తర్వాత నుండి రూ.2,000 నోట్ల ముద్రణ కోసం కొత్త ప్రతిపాదనే ఏదీ రాలేదన్నారు. అందుకే ఈ నోట్ల చలామణి తగ్గిందని తెలిపారు. నల్లధనాన్ని నిరోధించడంలో భాగంగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు 2016 నవంబర్ 8వ తేదీన కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ఆ తర్వాత రూ.2,000 నోట్లను ప్రవేశపెట్టింది. క్రమంగా రూ.500, రూ.200 కొత్త నోట్లనూ చలామణీలోకి తెచ్చింది.