పెట్రోల్ పెరుగుదల ధర్మసంకటం, అదితప్ప వేరేమార్గం లేదు: నిర్మల, జీఎస్టీలోకి వస్తే..
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఈ ధరల పెరుగుదల విపరీతమైన సమస్య అని, దీనికి ధరలు తగ్గించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఆమె స్పష్టం చేశారు. చమురు ధరలు తగ్గడానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చర్చించుకోవాల్సిన అంశాలు అన్నారు. ఇది ధర్మసంకమైన అంశమని, ధరలు తగ్గించడం తప్ప ఇంకో మార్గం లేదన్నారు.
'వాస్తవికతను వివరించేందుకు నేను ఏది చెప్పినా సమాధానాన్ని దాటవేయటం లేదా బ్లేమ్ చేయడం వంటిదే అవుతుంది. ఇంధన ధరలను తగ్గించడమే సరైన పరిష్కారం. పెట్రో ధరల పెరుగుదల ధర్మ్ సంకటమైన పరిస్థితి'. కస్టమర్లకు తుది ధర లేదా రిటైల్ ధర సహేతుకమైన స్థాయిలో ఉండటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన మార్గాన్ని గుర్తించాల'ని వ్యాఖ్యానించారు.
అందుకే పెరుగుతున్నాయి
చమురు ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయిస్తాయని, వీటిపై కేంద్రానికి నియంత్రణ ఉండదని నిర్మల చెప్పారు. చమురు దిగుమతులు, శుద్ధి చేయడం, పంపిణీ, లాజిస్టిక్స్ వంటి ఖర్చులను బట్టి ఈ కంపెనీలు చమురు ధరలను నిర్ణయిస్తాయన్నారు. అమె చెన్నై సిటిజన్ షిప్ ఫోరం సదస్సులో మాట్లాడారు. నవంబర్ నెల నుండి క్రూడాయిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయని ఆమె గుర్తు చేశారు. చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిలో కోత విధించడం వంటి వివిధ కారణాలతో ధరలు పెరుగుతున్నట్లు తెలిపారు.
రాష్ట్రాలతో సంప్రదింపులు
నేను ఒక్క కేంద్రమంత్రినే ఈ ధరలను తగ్గిస్తానని చెప్పలేనని ఎక్సైజ్ డ్యూటీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రాలు కూడా కలిసి రావాలని అభిప్రాయపడ్డారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ధరల పెరుగుదలపై చర్చించాలన్నారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు మోడీ ప్రభుత్వం సై అంటోంది. కానీ కొన్ని రాష్ట్రాలు అంగీకరించడం లేదు. దీనిపై నిర్మల మాట్లాడుతూ... దీనిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చే అంశం రాష్ట్రాలతో సంప్రదింపుల ద్వారా, జీఎస్టీలో చర్చించడం ద్వారా తీసుకునే నిర్ణయం అన్నారు.
అంతా ఒక ధర
రాష్ట్రాలు జీఎస్టీకి అంగీకరిస్తే దేశమంతా ఒకే ధర ఉంటుందని, వీటిపై వచ్చే ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవచ్చునని చెప్పారు. చమురు పైన కేంద్రం సొంత పన్ను వాటా, రాష్ట్రాలు సొంత పన్ను వాటాలు కలిగి ఉండటం కంటే జీఎస్టీలోకి తేవడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ హేతుబద్దీకరణ గురించి మాట్లాడుతూ... ప్రస్తుత జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణ అవసరం లేదన్నారు.