'టార్గెట్'ను చేధించిన రిలయన్స్, షేర్ రికార్డ్: రూ.15 లక్షల కోట్లతో సరికొత్త రికార్డ్
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త రికార్డులు సృష్టించింది. డిజిటల్ విభాగం జియో ప్లాట్ఫాంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చిన అనంతరం, ఇప్పుడు రిలయన్స్ రిటైల్లోకి వస్తున్నాయి. అమెరికా కంపెనీ సిల్వర్ లేక్ రూ.7500 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. కేకేఆర్ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఈ రెండు కూడా జియోలోను ఇన్వెస్ట్ చేశాయి. జియోలో ఇన్వెస్ట్ చేసిన పలుసంస్థలు రిలయన్స్ రిటైల్లోను పెట్టుబడులు పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ షేర్లు మరోసారి దూకుడు పెంచాయి.
అదరగొట్టిన మార్కెట్లు.. భారీ లాభాల్లో: సెన్సెక్స్ 455 పాయింట్లు అప్
'టార్గెట్'ను చేధించిన రిలయన్స్
రిలయన్స్లో జియో పెట్టుబడుల తర్వాత షేర్ ధర రూ.2000 క్రాస్ చేసింది. రిటైల్లో పెట్టుబడుల నేపథ్యంలో రూ.2250 దిశగా దూసుకెళ్తోంది. నేడు గం.12.01 సమయానికి రిలయన్స్ షేర్ 4.52 శాతం ఎగిసి రూ.2,259 వద్ద ట్రేడ్ అయింది. మోతీలాల్ ఓస్వాల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ బైరేటింగ్ ధరను రూ.2250గా పేర్కొంది. అంతకుముందు సెషన్లో షేర్ ధర 2.58 శాతం ఎగిసి రూ.2161.25 వద్ద క్లోజ్ అయింది. ఈ రోజు 3 శాతానికి పైగా ఎగిసింది.
6 శాతం ఎగిసిన షేర్లు.. రూ.15 లక్షల కోట్ల ఎం-క్యాప్
రిలయన్స్ ఇడంస్ట్రీస్ షేర్లు ఈ రెండు సెషన్లలోనే దాదాపు 5 శాతం లాభపడింది. రిలయన్స్ రిటైల్లో సిల్వర్ లేక్ పెట్టుబడులు, కేకేఆర్ కూడా ఆసక్తి చూపిస్తుందనే వార్తల నేపథ్యంలో షేర్లు దూసుకెళ్లాయి. రిలయన్స్ రిటైల్ దేశవ్యాప్తంగా 12000 స్టోర్స్ నిర్వహిస్తోంది. రెండు రోజుల్లోనే షేర్లు దూసుకెళ్లడంతో రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.15 లక్షల కోట్ల మార్క్ సమీపానికి చేరుకుంది. మొదటిసారి జూలై 27, 2020వ తేదీన రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.14.51 లక్షల కోట్లకు చేరుకుంది. రెండోస్థానంలో ఉన్న టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.8.8 లక్షల కోట్లుగా ఉంది. టీసీఎస్తో రిలయన్స్ ఎం-క్యాప్ ఒకటిన్నర రెట్లకు ఎక్కువగా ఉంది.
టాప్ గెయినర్స్లో రిలయన్స్
ఇదిలా ఉండగా, స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ దూసుకెళ్తోంది. ఉదయం సెన్సెక్స్ 179 పాయింట్లు, నిఫ్టీ 55 పాయింట్ల లాభాలతో ప్రారంభమైంది. ఆ తర్వాత అంతకంతకూ ఎగిసింది. మధ్యాహ్న గం.11.39 సమయానికి సెన్సెక్స్ 515 పాయింట్లు ఎగిసి 38,709 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత 12.02 సమయానికి 508 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టీ 136 పాయింట్లు లాభపడి 11,413 వద్ద ట్రేడ్ అయింది. కాగా, డాలర్ మారకంతో రూపాయి 12 పైసలు బలపడి 73.43 వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం గం.12 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో రిలయన్స్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, బీపీసీఎల్ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో హిండాల్కో, భారతీ ఇన్ఫ్రాటెల్, జేఎస్డబ్ల్యు స్టీల్, యూపీఎల్, టైటాన్ కంపెనీ ఉన్నాయి.