రిలయన్స్ రిటైల్ చేతికి రూ.5,550 కోట్లు, కేకేఆర్కు 1.28% వాటా
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ విభాగం రిలయన్స్ రిటైల్లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. అంతకుముందు రిలయన్స్ జియోలోకి వరుసగా పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు రిలయన్స్ రిటైల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అమెరికాకు చెందిన అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ KKR నుండి రూ.5,550 కోట్ల నగదు అందినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురువారం ప్రకటించింది.
దీంతో రిటైల్ విభాగంలో 1.28 శాతం వాటా ఆ సంస్థ సొంతం అయినట్లు తెలిపింది. కేకేఆర్ విభాగం అలీసమ్ ఏషియా హోల్డింగ్స్ నుండి రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ రూ.5550 కోట్ల మొత్తాన్ని పెట్టుబడిగా పొందిందని, ఇందుకు గాను 8,13,48,479 ఈక్విటీ షేర్లను ఆ సంస్థకు కేటాయించామని రిలయన్స్ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. రూ.4.21 లక్షల కోట్ల ప్రీ-మనీ ఈక్విటీ వ్యాల్యూ దగ్గర ఈ పెట్టుబడులు వచ్చాయి.
రిలయన్స్ రిటైల్ దేశవ్యాప్తంగా దాదాపు 12,000 స్టోర్స్ను కలిగి ఉండి, 640 మిలియన్ల ఫుట్ఫాల్స్ను అందిస్తోంది. ఇటీవల రిలయన్స్ రిటైల్లో అబుదాబి, ముబాదాల, టీపీజీ, జీఐసీ, జనరల్ అట్లాంటిక్ వంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి.