ముఖేష్ అంబానీ దూకుడు, ఆ స్టార్టప్స్ను వశం చేసుకునే ప్లాన్!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వ్యాపార విస్తరణ కోసం అటు తన జియో ప్లాట్ఫాంలో వాటాలను ప్రపంచ దిగ్గజ కంపెనీలకు విక్రయిస్తూనే, మరోవైపు స్టార్టప్స్ కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. ఇందులోభాగంగా ఫ్యూచర్ రిటైల్ చైన్తో చర్చలు సాగుతున్నట్లుగా గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా స్టార్టప్స్ మిల్క్ బాస్కెట్, అర్బన్ ల్యాడర్, జీవామీతోను చర్చలు జరుపుతోంది రిలయన్స్ ఇండస్ట్రీస్. భారీ మొత్తానికి ఈ డీల్ కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
MS Dhoni retires: శాలరీ, బిజినెస్.. ధోనీ సంపద ఎంతంటే?
మిల్క్ బాస్కెట్, అర్బన్ ల్యాడర్
ఈ-కామర్స్ వ్యాపార విస్తరణకు రిలయన్స్ వేగంగా ముందుకు సాగుతోంది. కిషోర్ బియానీ గ్రూప్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్ను విలీనం చేసుకునే యోచనలో ఉన్న రిలయన్స్ దేశీయంగా మరికొన్ని కంపెనీల కొనుగోలుకు చర్చలు నిర్వహిస్తోందని తెలుస్తోంది. ఆన్లైన్ ఫర్నీచర్ కంపెనీ అర్బన్ ల్యాడర్ పైన కూడా దృష్టి పెట్టారట. అలాగే మిల్క్ డెలివరీ కంపెనీ మిల్క్ బాస్కెట్ను కొనుగోలు చేసేందుకు కూడా ఆసక్తి చూపిస్తోందని తెలుస్తోంది.
చర్చలు సఫలమయ్యే దిశలో..
అర్బన్ ల్యాడర్తో చర్చలు సఫలమయ్యే దిశలో ఉన్నాయని తెలుస్తోంది. 30 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.225 కోట్లు)కు డీల్ కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, ఈ-కామర్స్ ఫార్మసీ స్టార్టప్ నెట్మేడ్స్తో పాటు జీవామీలో మెజార్టీ వాటా కొనుగోలుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చర్చలు జరుపుతోంది.
మిల్క్ బాస్కెట్..
మిల్క్ బాస్కెట్ ఇంతకుముందు బిగ్ బాస్కెట్, అమెజాన్తో చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు విఫలమయ్యాయని తెలుస్తోంది. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో మిల్క్ బాస్కెట్ సంప్రదింపులు జరుపుతోంది. ఇటీవల 5 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించడంతో ఇందుకు వేచిచూసే ధోరణితో మిల్క్ బాస్కెట్ ఉన్నట్లుగా చెబుతున్నారు. 1.5 కోట్ల డాలర్ల వ్యాల్యూగా మిల్క్ బాస్కెట్ అంచనాలు వేస్తోంది. కరోనా కారణంగా ఇటీవల మిల్క్ ఉత్పత్తులతో పాటు గ్రోసరీకి డిమాండ్ పెరిగింది.