వేతనాల కోత.. రిలయన్స్ సంచలన నిర్ణయం: ఏడాది శాలరీ వదులుకున్న ముఖేష్ అంబానీ
ముంబై: కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. చిన్న కంపెనీల నుండి పెద్ద సంస్థల వరకు దాదాపు అన్ని కూడా ఉద్యోగుల వేతనాల్లో కొంత శాతాన్ని కట్ చేస్తున్నాయి. ఈ మహమ్మారి ప్రభావం ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ పైన కూడా భారీ ప్రభావమే చూపింది. దీంతో ఈ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. వేతనాల కోత ప్రకటన చేసింది.
అత్యాశకు పోవద్దు.. ఇళ్లను వచ్చిన ధరకే అమ్మేయండి, మీకు 2 లాభాలు: గడ్కరీ
ఏడాది వేతనం తీసుకోవద్దని ముఖేష్ నిర్ణయం
కంపెనీ బోర్డు సభ్యులు, సీనియర్ లీడర్స్ వేతనాలలో 30 శాతం నుండి 50 శాతం కోత విధిస్తున్నట్లు రిలయన్స్ తెలిపింది. రిలయన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ అయితే 2020-21 ఆర్థిక సంవత్సరానికి వేతనం తీసుకోవద్దని నిర్ణయించారు. కరోనా కారణంగా ప్రధానంగా విమానయానం, ఆతిథ్య రంగాలపై భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. మిగతా రంగాలు పరిస్థితి కూడా అదే. రిలయన్స్ సైతం వేతనాల కోత ప్రకటించింది.
ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి
2008-09 నుండి ఆయన తన వార్షిక వేతనం పెంచుకోలేదు. దాదాపు పుష్కరకాలంగా అదే వేతనం తీసుకుంటున్నారు. కరోనా కారణంగా ఈసారి దానిని కూడా తీసుకోవద్దని నిర్ణయించారు. రిలయన్స్ గ్రూప్లోని చమురు రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ క్రమంలో పై-స్థాయిలో వేతనాల కోత విధించింది రిలయన్స్. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహణ వ్యయాలను భరించాలంటే ఇది తప్పదని రిలయన్స్ ప్రకటనలో తెలిపింది. వేతనాల కోత నిర్ణయం ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తుంది.
ఎవరి వేతనంలో ఎంత కోత?
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఈసీ మెంబర్స్, సీనియర్ లీడర్స్ వేతనంలో 30 శాతం నుండి 50 శాతం కోత విధిస్తున్నారు. రూ.15 లక్షళ కంటే ఎక్కువ వేతనం అందుకునే వారికి 10 శాతం వేతన కోత ఉంటుంది. రూ.15 లక్షల కంటే తక్కువ వేతనం ఉండేవారికి కోత లేదు. పనితీరు ఆధారంగా ప్రతి ఏడాది తొలి క్వార్టర్లో ఇచ్చే వార్షిక బోనస్ వాయిదా పడింది.