రిలయన్స్ సరికొత్త గొడుగు సంస్థ: గూగుల్, ఫేస్బుక్తో కలిసి UPI తరహా సంస్థ ఏర్పాటు!
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టెక్నాలజీ దిగ్గజాలు ఫేస్బుక్, గూగుల్తో కలిసి యూపీఐ పేమెంట్ తరహా యాప్ సంస్థ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఈ టెక్ దిగ్గజాలతో కలిసి న్యూ అంబరిల్లా ఎంటిటీ(NUE) కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైసెన్స్ కోసం సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి. గూగుల్, ఫేస్బుక్ సంస్థలకు ఈ NUEలో మైనార్టీ వాటా ఉండే అవకాశాలు ఉన్నాయి.
రోజురోజుకు డిజిటల్ పేమెంట్స్ పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్స్ పైన ముఖేష్ అంబానీ దృష్టి సారించారు. యూపీఐ తరహా మార్కెట్లో వాటాను కైవసం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రిటైల్ పేమెంట్స్ కోసం జాతీయ స్థాయిలో సరికొత్త గొడుకు సంస్థ-NUEని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఆర్బీఐకు సమర్పించేందుకు రిలయన్స్ సిద్ధమవుతోందట.
ఈ NUE సంస్థను రిలయన్స్లోని ఓ విభాగం, ఇన్ఫీబీమ్ అవెన్యూస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ సో హమ్ భారత్ సంయుక్తంగా ప్రమోట్ చేయబోతున్నాయని, NUE లైసెన్సులో గూగుల్, ఫేస్బుక్కు స్వల్ప వాటాలు ఉంటాయని చెబతున్నారు. ఇట్జ్క్యాష్ వ్యవస్థాపకుడు, డిజిటల్ పేమెంట్ ఇండస్ట్రీ నిపుణులు నవీన్ సూర్యను NUE మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా నియమించినట్లు కూడా వార్తలు వచ్చాయి.