ఆరేళ్ల గరిష్టానికి.. రిటైల్ ద్రవ్యోల్భణం 7.59 శాతం: గుడ్డు, మాంసం ధరలు దిగి రావొచ్చు
జనవరి 2020లో రిటైల్ ద్రవ్యోల్భణం అంచనాలకు మించి ఆరేళ్ల గరిష్టానికి చేరుకుంది. కస్టమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్భణం జనవరి నెలలో 7.59 శాతానికి పెరిగింది. డిసెంబర్ నెలలో 7.35 శాతంగా ఉంది. CPI గణాంకాలను నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ బుధవారం వెల్లడించింది. 2019 జనవరిలో ద్రవ్యోల్భణం రేటు 2.05 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్భణం 2019 డిసెంబర్ నెలలో 14.12 శాతం కాగా, ఇప్పుడు 13.63 శాతానికి తగ్గింది.
ద్రవ్యోల్భణం ఇలా..
రిటైల్ ద్రవ్యోల్భణం 2014 మే (8.33 శాతం) తర్వాత ఇదే గరిష్ఠం. 2019 డిసెంబర్ నెలలో 7.35 శాతం, జనవరి 2019లో 1.97 శాతంగా ఉన్న ఈ ద్రవ్యోల్భణం ఇప్పుడు 7.59కి పెరిగింది. కూరగాయలు, పప్పుధాన్యాలు, మాంసం, చేపల ధరలు పెరుగుతుండటం ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. ఐనా స్థూల ఆహార ద్రవ్యోల్బణం గతంతో పోలిస్తే జనవరిలో 13.63% తగ్గడం గమనార్హం. ఇంతకుముందు 14.19 శాతంగా ఉంది.
ధరలు ఎలా పెరిగాయంటే..
కూరగాయల ధరలు 50.19%, పప్పులు, ఆహారోత్పత్తుల ధరలు 16.71%, మాంసం, చేపల ధరలు 10.50%, గుడ్ల ధరలు 10.41% మేర పెరిగాయి. ఆహార, శీతలపానియాల విభాగంలో ద్రవ్యోల్బణం 11.79% నమోదయినట్లు NSO తెలిపింది. హౌజింగ్ 4.20% ఖరీదుగా మారిందని, ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం 3.66% ఉందని తెలిపింది.
గుడ్డు, మాంసం ధరలు దిగి రావొచ్చు
రాబోవు నెలల్లో కూరగాయలు ఇతర ఆహారోత్పత్తుల ధరలు తగ్గవచ్చునని, ముఖ్యంగా మాంసం, గుడ్డు ధరలు దిగి రావొచ్చుననే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వివిధ రంగాల్లోని సేవలు ప్రియం కావడం కూడా ద్రవ్యోల్బణాన్ని కారణంగా ఉంటుందని చెబుతున్నారు.
మార్చి నుంచి ఆకాశాన్నంటిన ధరలు
మార్చి 2019 నుంచి ఆహార ఉత్పత్తుల ధరలు క్రమంగా పెరుగుతూ నింగినంటాయి. ఉల్లి ధర ద్రవ్యోల్బణం పెరగడానికి కారణమైంది. దీనికి తోడు కూరగాయలు, పప్పుధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార ఉత్పత్తుల ధరలు భారీగా పెరగడంతో ద్రవ్యోల్భణం పెరిగింది.
రెపో, రివర్స్ రెపో రేటు యథాతథం
ద్రవ్యోల్భణం పెరుగుదల RBI ద్రవ్య సమీక్షను ప్రభావితం చేస్తోంది. ఇటీవల రెపో, రివర్స్ రెపో రేటును యథాతథంగా ఉంచింది. ద్రవ్యోల్భణం చాలా అనిశ్చితంగా ఉన్నందున రెపో రేటును 5.15 శాతంగానే ఉంచినట్లు ఆర్బీఐ ఇటీవల వెల్లడించింది.దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4% (2% మార్జిన్) అటు ఇటుగా ఉండేలా చూడాలని ఆర్బీఐ కేంద్రానికి సూచించింది.