Retail Inflation: దిగొచ్చిన ధరలు.. అక్టోబర్లో తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
దేశంలో ధరల మంట కాస్త తగ్గింది. అక్టోబర్ లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.77 శాతానికి తగ్గింది. సెప్టెంబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 7.41 శాతంగా ఉండగా.. అంతకుముందు ఆగస్ట్ నెలలో 6.71 శాతంగా ఉంది. ఆహారం, ఇంధనం, వస్తు తయారీ ధరలు తగ్గడం ఇందుకు అనుకూలించింది. అక్టోబర్ 2021లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.48 శాతంగా ఉంది. మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, ఫ్యాబ్రికేటెడ్ మెటల్ ఉత్పత్తులు, టెక్స్టైల్స్, తదితర ఉత్పత్తుల ధరలు తగ్గడం టోకు ద్రవ్యోల్బణం ఉపశమించడానికి అనుకూలించినట్టు కేంద్ర వాణిజ్య శాఖ వివరించింది.
ఇప్పటికీ రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట నియంత్రిత స్థాయి 6 శాతానికి పైనే ఉండడం గమనార్హం.వరుసగా మూడు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 2 శాతం మార్జిన్తో 4 శాతంగా ఉండేలా చూడడంలో ఆర్బీఐ విఫలమైనందున, వైఫల్యానికి గల కారణాలు, సీపీఐని తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపింది.
ఆహారోత్పత్తుల టోకు ద్రవ్యోల్బణం 11.03 శాతం నుంచి 8.33 శాతానికి తగ్గింది. కూరగాయలు, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, పండ్లు, గుడ్లు, మాంసం, చేపల టోకు ధరలు తగ్గినట్లు నివేదికలో తెలిపారు. సెప్టెంబర్లో కూరగాయలపై ద్రవ్యోల్బణం 39.66 శాతంగా ఉంటే, అక్టోబర్కు 17.61 శాతానికి తగ్గింది. బియ్యం, గోధుమ, ఇతర ధాన్యాల ధరలు పెరిగాయి. ఇంధన ద్రవ్యోల్బణం 9.93 శాతంగా ఉంది.