భారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు: RBI కీలక సూచన
పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో గత ఏడాది ప్రభుత్వం పన్నులు పెంచింది. దీంతో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. మే 4వ తేదీ నుండి పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 20 సార్లు పెరిగాయి. ఆర్థిక రాజధాని ముంబైలో రూ.100కు పైకి చేరుకుంది. మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రూ.105 కూడా క్రాస్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు రంగ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు సవరిస్తాయి.
పన్నులు తగ్గిస్తే..
పెట్రోల్, డీజిల్ ధరలపై సర్వత్రా అసంతృప్తి నెలకొంది. ధరలు తగ్గించాలని విపక్షాలు డిమాండ్ చేస్తుండగా, ధరల పెరుగుదల భారంగా మారిందని సామన్యులు చెబుతున్నారు. పెరుగుదున్న పెట్రోల్, డీజిల్ ధరలకు తగ్గింపు ఒకటే మార్గమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర చమురుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలోనే అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులకు తోడు కరోనా సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులు పెంచారు. దీంతో ధరలు భారీగా పెరిగాయి. వీటిని నరేంద్ర మోడీ ప్రభుత్వం తగ్గిస్తుందని భావిస్తున్నారు. అయితే ఎప్పుడు అనేది స్పష్టత లేదు.
సమన్వయంతో వెళ్తే తగ్గుదల
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రబ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) స్పందించింది. పెరుగుతున్న ధరల కట్టడికి ఓ సూచన చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు, ఎక్సైజ్ డ్యూటీ, సెస్ అంశంపై ఆర్బీఐ సూచన చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగి, పన్నులు తగ్గిస్తే ధరలు తగ్గుతాయని అభిప్రాయపడింది.
జీఎస్టీ పరిధిలోకి వస్తేనే...
ద్రవ్యోల్భణం పెరిగే అవకాశముందని, అంతర్జాతీయంగా ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా ముడి సరుకు, లాజిస్టిక్ ఖర్చులు పెరుగుతున్నాయని పేర్కొంది. దేశంలో చమురు ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మార్పిడి రేటు పైన ఆధారపడి ఉంటాయి. దీనికి తోడు ప్రభుత్వాల పన్నులు, సెస్, దిగుమతి సుంకాలు ఉంటాయి. డీలర్ కమిషన్, సరకు రవాణా ఛార్జీలు జత కలుస్తాయి. ప్రస్తుం పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి రావడం లేదు. దీనిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. జీఎస్టీ పరిధిలోకి వస్తే ధరలు తగ్గుతాయి.