Reliance: కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్న రిలయన్స్.. ఆ కంపెనీ కొనుగోలుకు చర్చలు..
Reliance: ఆయిల్స్ నుంచి కెమికల్స్ వరకు విస్తరించిన రిలయన్స్ సామ్రాంలోకి మరో కొత్త వ్యాపారం వచ్చి చేరుతోంది. దేశీయ కుబేరుడు ముఖేష్ అంబానీ దీనికి సంబంధించి ఇప్పటికే పావులు కదుపుతున్నట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. కరోనా తర్వాత మళ్లీ గాడిన పడుతున్న ఈ రంగంలోకి అడుగు పెట్టాలని అంబానీ భావిస్తున్నారు.
సెలూన్ బిజినెస్..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లో భాగమైన రిలయన్స్ రిటైల్ సంస్థ తాజాగా సెలూన్ వ్యాపారంలోకి ప్రవేషించాలని యోచిస్తోంది. ఇందుకోసం నేచురల్స్ సెలూన్స్ అండ్ స్పా సంస్థతో చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. రిటైల్ వ్యాపార బాధ్యతలు అంబానీ కూతురు ఇషా చేతికి రావటంతో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే వ్యాపారంలో ఉన్న నేచురల్స్ సంస్థలో 49 శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి.
చెన్నై కంపెనీ..
చెన్నై ఆధారిత స్పా అండ్ సెలూన్ చైన్ కు దేశవ్యాప్తంగా 700 అవుట్ లెట్స్ ఉన్నాయి. రిలయన్స్ కంపెనీలో పెట్టుబడుల ద్వారా దీనిని నాలుగు నుంచి ఐదు రెట్లు పెంచాలని యోచిస్తోందని సమాచారం. అయితే ప్రస్తుత ప్రమోటర్లే కంపెనీ కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతను రిలయన్స్ ఇస్తుందని తెలుస్తోంది. చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని నేచురల్స్ సీఈవో సీకే కుమారవేల్ చెప్పగా.. రిలయన్స్ రిటైల్ మాత్రం వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది.
2000 సంవత్సరంలో..
నేచురల్స్ కంపెనీ 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. 2025 నాటికి దేశవ్యాప్తంగా తన సెలూన్ల సంఖ్యను 3,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. COVID-19 మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో సెలూన్ వ్యాపారం భారీగా దెబ్బతింది. ఆ సమయంలో నేచురల్స్ సీఈవో కుమారవేల్ వ్యాపారాన్ని కాపాడేందుకు మే 2020లో ప్రభుత్వ సహాయాన్ని కూడా కోరారు.
సెలూన్ వ్యాపారం..
భారతదేశంలో సెలూన్ వ్యాపారం రూ.20,000 కోట్ల పరిశ్రమ. ఇందులో బ్యూటీ పార్లర్లు, బార్బర్ షాపులతో కూడిన 6.5 మిలియన్ల మంది ప్లేయర్స్ ఉన్నారు. హిందుస్థాన్ యూనిలీవర్ లాక్మే అండ్ ఎన్రిచ్, గీతాంజలి వంటి ప్రాంతీయ బ్రాండ్లతో పోటీపడేందుకు రిలయన్స్ కు ఈ ఒప్పందం ఉపకరించనుంది. AZORTE బ్రాండ్ క్రింద రిలయన్స్ తన మొదటి ప్రీమియం ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్ స్టోర్ను ప్రారంభించిన తర్వాత ఈ డీల్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.