ముఖేష్ అంబానీ చేతికి మరో కంపెనీ, అర్బన్ ల్యాడర్ను కొనుగోలు చేసిన రిలయన్స్ రిటైల్
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ ఫర్నీచర్ రిటైలర్ అర్బన్ ల్యాడర్లో మెజార్టీ వాటాలు కొనుగోలు చేసింది. రిలయన్స్ రిటైల్ విస్తరణ పైన దృష్టి సారించింది. ఇందులో భాగంగా రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్ (RRLV).. అర్బన్ ల్యాడర్ హోమ్ డెకార్స్ సొల్యూషన్ లిమిటెడ్ను దక్కించుకుంది. ఈ డీల్ వ్యాల్యూ రూ.182.12 కోట్లు. దీంతో అర్బన్ ల్యాడర్ సంస్థలో 96 శాతం వాటాలు RRLV చేతికి వచ్చాయి. అంతేకాదు, మిగతా వాటాను కొనుగోలు చేసే హక్కు కూడా RRLV పొందింది. అలా అయితే అర్బన్ ల్యాడర్.. RRLVకు వంద శాతం అనుబంధ సంస్థగా మారుతుంది.
రియల్ ఎస్టేట్కు పన్ను ఊరట: ఇళ్ల ధరలు తగ్గుతాయా? ఇద్దరికీ ప్రయోజనమే..
96 శాతం వాటా.. రెండేళ్లలో పూర్తి
అర్బన్ ల్యాడర్లో 96 శాతం వాటాలను దక్కించుకున్నట్లు RRLV శనివారం రాత్రి స్టాక్ ఎక్స్చంంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. ఈ కంపెనీలో భవిష్యత్తులో మరో రూ.75వేల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. 2023 డిసెంబర్ నాటికి ఈ డీల్ పూర్తి కావొచ్చు. ఈ ఆర్థిక సంవత్సరంలో ముఖేష్ అంబానీ తన సంస్థల్లోకి అంతర్జాతీయ పెట్టుబడులు ఆహ్వానించడంతో పాటు, దేశీయంగా పలు సంస్థలను కొనుగోలు చేస్తున్నారు. ప్రారంభంలో జియోలో, ఆ తర్వాత రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో గూగుల్ సహా పలు సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. అదే సమయంలో ముఖేష్ అంబానీ ఫ్యూచర్ గ్రూప్ వంటి సంస్థలను కొనుగోలు చేస్తున్నారు. ఈ పెట్టుబడులకు ఎలాంటి ప్రభుత్వ, రెగ్యులేటరీ అనుమతులు అవసరం లేదని చెబుతున్నారు.
ఆసియా ధనవంతుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ప్లాట్ఫాంలోకి 20 బిలియన్ డాలర్లను సమీకరించారు. ఇందులో ఫేస్బుక్తో పాటు పలు అంతర్జాతీయ కంపెనీలు ఇన్వెస్ట్ చేశాయి.
2012లో ప్రారంభమై...
మన దేశంలో అర్బన్ ల్యాడర్ 2012 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. డిజిటల్ ప్లాట్ ఫాంపై అర్బన్ ల్యాడర్ ఫర్నీచర్ వ్యాపారం నిర్వహిస్తోంది. పలు నగరాల్లో రిటైల్ స్టోర్స్ చైన్ ఉంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ పెట్టుబుడులు పెట్టడంతో అర్బన్ ల్యాడర్ మరింత పుంజుకోనుంది. అర్బన్ ల్యాడర్ 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.434 కోట్ల టర్నోవర్ను నమోదు చేసింది. నికర లాభం రూ.49.41 కోట్లుగా నమోదయింది. 2018 ఆర్థిక సంవత్సరంలో రూ.151.22 కోట్ల టర్నోవర్, 2017 ఆర్థిక సంవత్సరంలో రూ.50.61 కోట్ల టర్నోవర్ చేసింది.
కఠిన పరిస్థితులు..
ఎనిమిదేళ్లుగా భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అర్బన్ ల్యాడర్ వ్యాల్యూ 2018లో రూ.1200 కోట్లుగా ఉంది. అయితే 2019లో దీని వ్యాల్యూ రూ.750 కోట్లకు పడిపోయింది. ఇటీవలి కాలంలో అర్బన్ ల్యాడర్ కఠినపరిస్థితులు ఎదుర్కొంది. ఆశిష్ గోయల్, రాజీవ్ శ్రీవాత్సవ 2012లో దీనిని ప్రారంభించారు. టాప్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ నుండి రూ.700 కోట్లకు పైగా సమీకరించారు. సిక్వియా కాపిటల్, సెయిఫ్ పార్టునర్స్, కలారీ కాపిటల్, హెడ్గే ఫండ్ వంటి సంస్థల నుండి సమీకరించారు. గత ఏడాది మరో రూ.15 కోట్లు సమీకరించింది.