రిలయన్స్ రికార్డ్ లాభాలు, కరోనా దెబ్బపడినా.. అవే కలిసొచ్చాయి
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అదరగొట్టింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి గాను రిలయన్స్ అంచనాలకు మించి ఫలితాలు సాధించింది. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, రిటైల్ వ్యాపారాలపై కరోనా మహమ్మారి ప్రభావం పడినప్పటికీ వాటాల విక్రయాలు, జియో ఆదాయం అండతో రూ.13,248 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.10,141 కోట్లతో పోలిస్తే 30.6 శాతం లాభం పెరిగింది. అలాగే 2019 అక్టోబర్-డిసెంబర్లో నమోదు చేసిన గరిష్ట క్వార్టర్ లాభం రూ.11,640 కోట్లను దాటేసింది. రిలయన్స్ పెట్రోల్ బంక్స్ వ్యాపారంలో 49% వాటాను బీపీసీఎల్కు రూ.7,629 కోట్లకు విక్రయించింది. దీంతో గత క్వార్టర్లో రూ.4,996 కోట్ల ఏకకాల లాభం (వన్ టైమ్ గెయిన్) సమకూరినట్లు తెలిపింది.
రూ.2,520 కోట్లతో జియో అదరగొట్టింది.. లాక్డౌన్ టైంలో లాభాలు మూడింతలు
భారీగా తగ్గిన రిఫైనరీ ఆదాయం
ఏప్రిల్-జూన్ క్వార్టర్లో లాభదాయకతకు ప్రామాణికమైన ఎబిటా మాత్రం 11.8% శాతం తగ్గి రూ.21,585 కోట్లకు పరిమితమైంది. ఆయిల్ టు కెమికల్, రిటైల్ వ్యాపారాల ఆదాయం తగ్గడం ముఖ్య కారణం. కరోనా నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మార్జిన్స్ తగ్గి, పెట్రోకెమికల్స్ ఆదాయం 33% తగ్గి రూ.25,192 కోట్లకు పరిమితమైంది. రిఫైనరీ ద్వారా రాబడి సగానికి పైగా తగ్గి రూ.46,642 కోట్లుగా ఉంది. బ్యారెల్ ముడి చమురు శుద్ధి మార్జిన్ 8.9 డాలర్ల నుండి 6.3 డాలర్లకు పడిపోయింది. గత దశాబ్దకాలంలో ఇదే కనిష్ట మార్జిన్. గత ఏడాది ఏప్రిల్-జూన్ నెలలో 8.1 డాలర్లుగా ఉంది. సమీక్షా కాలానికి రిఫైనరీ వ్యాపార స్థూల లాభం 26 శాతం తగ్గి రూ.3,818 కోట్లకు పడిపోయింది.
లాక్ డౌన్తో రిటైల్ ఆదాయంలో తగ్గుదల
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో రిలయన్స్ స్టోర్స్ క్లోజ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఏప్రిల్-జూన్ క్వార్టర్లో రిటైల్ వ్యాపారంపై ప్రభావం పడింది. ఆదాయం 17% తగ్గి రూ.31,633 కోట్లకు పడిపోయింది. స్థూల లాభం 47.4 శాతం తగ్గి రూ.1,083 కోట్లకు పరిమితమైంది. 50% స్టోర్స్ పూర్తిగా మూసివేయాల్సి వచ్చిందని, 29% స్టోర్స్ను పాక్షికంగా తెరిచామని రిలయన్స్ రిటైల్ గ్రూప్ తెలిపింది.
అందుకే మెరుగైన ఫలితాలు
ఇంధన విక్రయ వ్యాపారంలో బీపీకీ వాటా విక్రయంతో రూ.4,996 కోట్లు ఒకేసారి లాభం రాగా, జియో స్టాండలోన్ నికర లాభం వృద్ధి చెందడంతో మిగతా వ్యాపార విభాగాల లాభాలు తగ్గినా రికార్ట్ స్థాయి లాభాన్ని నమోదు చేసినట్లు రిలయన్స్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షల కారణంగా డిమాండ్ గణనీయంగా పడిపోవడంతో తమ హైడ్రోకార్పన్ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు వెల్లడించింది. తమ కార్యకలాపాల విధానంలో ఉన్న సౌలభ్యంతో ఇంచుమించు సాధారణ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించామని, అందుకే మెరుగైన ఫలితాలు వచ్చినట్లు తెలిపింది. వాటాల విక్రయం ద్వారా రూ.1,52,056 కోట్లు రిలయన్స్ సమీకరించింది. కాగా, జియో లాభం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్-జూన్ క్వార్టర్లో రూ.2,520 కోట్లు నమోదయింది. రిలయన్స్ అదరగొట్టిన నేపథ్యంలో ఈ రోజు మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు తిరిగి పుంజుకునే అవకాశముంది. ఫలితాలకు ముందు భారీగా నష్టపోయిన షేర్లు ఇప్పుడు కోలుకుంటాయని భావిస్తున్నారు. పెట్రో కెమికల్స్, రిటైల్ వ్యాపారంలో కరోనా వల్ల తగ్గినప్పటికీ ఊహించినంతగా లేదు. అలాగే జియో వంటి వ్యాపారాల అండతో లాభాలు గతంలో కంటే పెరిగాయి. కాబట్టి షేర్ ధర జూమ్ అనే అవకాశాలు ఉన్నాయి.