లాభాల్లో రిలయన్స్ జియో .. గతేడాది కంటే మెరుగ్గా, జూన్ త్రైమాసిక ఫలితాల్లో 3,651 కోట్ల లాభం
టెలికాం రంగంలో సంచలనాలకు కేరాఫ్ అయిన కార్పోరేట్ దిగ్గజం రిలయన్స్ జియో ఈ జూన్ త్రైమాసికంలో లాభాల బాటలో పయనించింది . భారతదేశ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన నికర లాభంలో 44.9 శాతం పెరుగుదలను నమోదు చేసింది. దీంతో రిలయన్స్ జియో లాభం 3,651 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో 2,519 కోట్ల రూపాయలు లాభం కాగా ఈ ఏడాది 3651 కోట్ల రూపాయలకు చేరుకుంది.
2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జియో ప్లాట్ఫామ్ ఆపరేషన్స్ ఆదాయం, 18,952 కోట్లుగా ఉంది, కార్యాకలాపాల నిర్వహణలో 9.8 శాతం వృద్ధిని సాధించింది. అంతకుముందు ఏడాది కాలంలో ఇది 17,254 కోట్ల రూపాయలతో పోలిస్తే ఈ ఏడాది వృద్ధి బాగానే కనిపిస్తుంది. జూన్ 2021 నాటికి రిలయన్స్ జియో మొత్తం కస్టమర్ల సంఖ్య 440.6 మిలియన్లు కాగా ఈ ఏడు 42.3 మిలియన్ల కస్టమర్లను అదనంగా నివేదించింది.
జూన్ త్రైమాసికంలో కంపెనీ ఇబిఐటిడిఎ 8 8,892 కోట్లుగా ఉంది. ఇది సంవత్సరానికి 21.3 శాతం వృద్ధిని సాధించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 7,332 కోట్ల రూపాయలు. కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రతిబింబించే ఇబిఐటిడిఎ మార్జిన్ గత ఏడాది ఇదే త్రైమాసికంలో 42.5 శాతంతో పోలిస్తే 46.9 శాతానికి విస్తరించింది.జూన్ త్రైమాసికంలో టెలికమ్యూనికేషన్ కంపెనీ సేవల విలువ 22,267 కోట్ల రూపాయలుగా ఉంది, ఇది సంవత్సరానికి 9.8 శాతం అధికంగా ఉంది, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో రూ .20,277 కోట్లుగా ఉంది. ఇటీవలి నెలల్లో జియోఫైబర్ మూడు మిలియన్లకు పైగా కొత్త కస్టమర్లను కలిగి ముందుకు దూసుకుపోతుందని కంపెనీ ప్రకటించింది.