జియో కస్టమర్లకు భారీ షాక్, డిసెంబర్ 1 నుండి టారిఫ్ పెంపు
భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా దారిలోనే రిలయన్స్ జియో నడిచింది. టారిఫ్ను 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన చార్జీలు డిసెంబర్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తున్నాయి. టారిఫ్ పెంపుకు సంబందించి ఇటీవల ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఇటీవలే షాకిచ్చాయి. ఇప్పుడు జియో అదే దారిలో నడిచింది. టెలికాం పరిశ్రమను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఛార్జీలను పెంచుతున్నట్లు జియో ఆదివారం నాటి ప్రకటనలో తెలిపింది. సవరించిన అన్ని ప్లాన్ల వివరాలను వెల్లడించింది. జియో ఫోన్ సహా, అన్లిమిటెడ్ ప్రీపెయిడ్, డేటా-ఆన్స్ ధరలూ పెరిగాయి. జియో ఫోన్ కోసం అందుబాటులోని ప్రాథమిక ప్లాన్కు రూ.75 బదులు డిసెంబర్ 1 నుండి రూ.91 చెల్లించాలి. అలాగే రూ.199 ప్లాన్ (28 రోజులకు 1.5GB/రోజుకు) ధరను రూ.239కు పెంచింది. అలాగే, రూ.444 ప్లాన్కు రూ.533, రూ.555 ప్లాన్కు రూ.666 చొప్పున చెల్లించాలి.
దేశంలో ప్రస్తుతం ఉన్న టారిఫ్ ధరలు కంపెనీలు నడిచేందుకు ఏమాత్రం సహకరించేలా లేవని, పెంచితేనే కంపెనీలు మనగలుగుతాయని భారతీ ఎయిర్టెల్ ఎప్పటి నుండో చెబుతోంది. త్వరలో టారిఫ్స్ పెంచే అవకాశం ఉందని ఆ సంస్థ అధినేత గతంలోనే స్పష్టం చేశారు. దాదాపు వారం క్రితం ధరలు పెంచుతున్నట్లు టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. టారిఫ్ను 20 శాతం నుండి 25 శాతం మేర పెంచినట్లు సోమవారం తెలిపింది. వాయిస్ ప్లాన్స్, అన్లిమిటెడ్ వాయిస్, డేటా ప్లాన్ బండిల్స్, డేటా టాప్-అప్ రీచార్జీల పైన ప్రభావం చూపిస్తుంది. పెరిగిన కొత్త ఛార్జీలు 26 నవంబర్ 2021 నుండి అమలులోకి వస్తాయని తెలిపింది. ఎంట్రీ లెవల్ వాయిస్ ప్లాన్ 25 శాతం పెరిగింది. మోస్ట్ అన్లిమిటెడ్ వాయిస్ బండిల్స్ 20 శాతం మేర పెరిగాయి.
వొడాఫోన్ ఐడియా(VI) కూడా ఎయిర్టెల్ దారిలో టారిఫ్ పెంపును మరుసటి రోజే ప్రకటించింది. వొడాఫోన్ ఐడియా ప్రకటించిన కొత్త టారిఫ్ ధరలు నవంబర్ 25, గురువారం నుండి అమలులోకి వస్తాయి. భారతీ ఎయిర్టెల్ 25 శాతం వరకు టారిఫ్ పెంచగా, VI కూడా 25 శాతం మేర పెంచింది. ఈ టారిఫ్ పెంపు ఆర్పు పెరగడానికి ఉపయోగపడుతుందని, అలాగే పరిశ్రమ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించేందుకు సహకరిస్తుందని తెలిపింది.