ముఖేష్ అంబానీ రిలయన్స్ కిందకు, ఎస్బీఐ పైకి: మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీ ఇదే...
ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫార్చ్యూన్ గ్లోల్ 500 జాబితాలో 59 ర్యాంకులు క్షీణించి 155వ స్థానానికి పడిపోయింది. అదే సమయంలో ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం 16 ర్యాంకులు ఎగబాకి 205 ర్యాంకుకు చేరుకుంది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా ఆయా కంపెనీల పరిమాణాన్ని (ఆదాయ) వెల్లడించే 2021 ఫార్చ్యూన్ గ్లోబల్ జాబితా సోమవారం నాడు విడుదలైంది. దీని ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ 155వ స్థానంలో, ఎస్బీఐ 205వ స్థానంలో ఉంది. రిలయన్స్ గతంలో 100 స్థానాలకు దిగువన ఉండగా, ఇప్పుడు ఆ పైకి పడిపోయింది.
రిలయన్స్ క్షీణత, ఎస్బీఐ అదుర్స్
ఫార్చ్యూన్ జాబితాలో 524 బిలియన్ డాలర్ల ఆదాయంతో వాల్మార్ట్ అగ్రస్థానంలో ఉంది. చైనాకు చెందిన స్టేట్ గ్రిడ్ 384 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా, 280 బిలియన్ డాలర్ల ఆదాయంతో అమెజాన్ ఇంక్ మూడో స్థానంలో నిలిచాయి. చైనాకు చెందిన నేషనల్ పెట్రోలియం, సినోపెక్ గ్రూప్స్ వరుసగా నాలుగు, ఐదో స్థానంలో ఉన్నాయి.
ఈ జాబితాలో ఆపిల్ ఆరో స్థానంలో ఉంది. సౌదీ ఆరామ్కో 14వ స్థానంలో నిలిచింది. ఇక, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆదాయం 25.3 శాతం క్షీణించడంతో 63 బిలియన్ డాలర్లకు చేరుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఆదాయం 52 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ జాబితాలో ఎస్బీఐ వరుసగా రెండో సంవత్సరం తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. గత ఏడాది కూడా ఎస్బీఐ 15 ర్యాంకులు మెరుగుపడింది.
ఈ కంపెనీలు ఇలా...
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC) 50 బిలియన్ డాలర్ల ఆదాయంతో 61 స్థానాలను కోల్పోయి 212 స్థానానికి పడిపోయింది. ఆయిల్ అండ్ నేచరల్ గ్యాస్ కార్పోరేషన్ (ONGC) 46 బిలియన్ డాలర్ల ఆదాయంతో 53 ర్యాంకులు పైకి చేరుకొంది. దీంతో 2021 ఫార్చ్యూన్ గ్లోబల్ జాబితాలో 243వ స్థానానికి ఎగబాకింది.
మరో సంస్థ రాజేష్ ఎక్స్పోర్ట్స్ బాగా రాణించి 114 ర్యాంకులు ఎగిసి 348వ ర్యాంకులో నిలిచింది. ఇక, దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ ర్యాంకు తగ్గింది. టాటా మోటార్స్ 20 స్థానాలు పడిపోయి 327వ ర్యాంకుకు, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ (BPCL) 394 పాయింట్ల నుండి 309 పాయింట్లకు పడిపోయింది.
కొలమానం ఏదంటే...
2021 మార్చి 31వ తేదీ నాటికి ఆయా కంపెనీల ఆదాయం ఆధారంగా ర్యాంకులు ఇచ్చినట్లు ఫార్చ్యూన్ వెల్లడించింది. రిలయన్స్ ఆదాయం 63 బిలియన్ డాలర్లు, ఎస్బీఐ ఆదాయం 52 బిలియన్ డాలర్లు, ఐవోసీ ఆదాయం 50 బిలియన్ డాలర్లు, ఓఎన్జీసీ ఆదాయం 46 బిలియన్ డాలర్లు, రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఆదాయం 35 బిలియన్ డాలర్లుగా నమోదయింది.
వాల్మార్ట్ 16వసారి
ప్రపంచ దిగ్గజం వాల్మార్ట్ 1995 నుండి 16వసారి ఫార్చ్యూన్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. అంతేకాదు, గత ఎనిమిదేళ్లుగా తొలి స్థానంలోనే కొనసాగుతోంది. ఈ ఎనిమిదేళ్లుగా ఏ కంపెనీ దీనిని అధిగమించలేకపోయింది. మెయిన్లాండ్ ఇండియా కూడా గత ఏడాది కంటే 11 స్థానాలు మెరుగుపరుచుకొని 135వ ర్యాంకులోకి వచ్చింది. ఇక ఈ జాబితాలో అమెరికాకు చెందిన 122 కంపెనీలు, జపాన్కు చెందిన 53 కంపెనీలు, చైనాకు చెందిన 143 కంపెనీలు ఉన్నాయి. చైనా కంపెనీలు మొదటిసారి అమెరికాను దాటవేశాయి.
ప్రపంచ జీడీపీలో మూడొంతులు...
ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీలు.. ప్రపంచ జీడీపీలో మూడొంతుల ఆదాయాన్ని జనరేట్ చేస్తున్నాయి. ఈ కంపెనీలు అన్నీ 31.7 ట్రిలియన్ డాలర్ల ఆదాయాన్నిజనరేట్ చేశాయి. గత ఏడాది కంటే ఇది 5 శాతం తక్కువ. లాభం 1.6 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇది కూడా 20 శాతం తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలు 69.7 మిలియన్ల మందికి ఉద్యోగ, ఉపాది అవకాశాలు కల్పించాయి. టాప్ 500 కంపెనీల్లో అత్యంత అధిక ఆదాయం పొందిన వాటిలో ఆరో ర్యాంకులో నిలిచిన ఆపిల్ ఉంది. ఈ కంపెనీ లాభం 57 బిలియన్ డాలర్లుగా నమోదయింది. 2021లో మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీ ఇది.
టాప్ 10 కంపెనీలు ఇవే...
వాల్మార్ట్ (US)
స్టేట్ గ్రిడ్ (China)
అమెజాన్ డాట్ కామ్ (US)
చైనా నేషనల్ పెట్రోలియం (China)
సినోపెక్ (China)
ఆపిల్ (US)
సీవీఎస్ హెల్త్ (US)
యునైటెడ్ హెల్త్ గ్రూప్ (US)
టయోటా మోటార్ (Japan)
వోక్స్వ్యాగన్ (Germany)
ఈ ఫార్చ్యూన్ 500 జాబితాలో 45 కొత్త, రీ-లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ఇందులో 18 చైనాకు చెందినవే. ఇందులో చైనా స్టేట్ షిప్బిల్డింగ్ కార్ప్, జెజియాంగ్ రోంగ్షేంగ్ హోల్డింగ్స్ గ్రూప్, ఝెజియాంగ్ హెంగ్యీ గ్రూప్, సునాక్ చైనా హోల్డింగ్స్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఏడు ప్రముఖ టెక్ కంపెనీలు ఉన్నాయి. అమెరికాకు చెందిన అమెజాన్, అల్పాబెట్, ఫేస్బుక్, చైనాకు చెందిన జేడీ డాట్ కామ్, అలిబాబా గ్రూప్, టెన్సెంట్ హోల్డింగ్స్, షియోమీ గ్రూప్ ఉన్నాయి. షియోమీ 84 స్థానాలు ఎగాబాకింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోను చైనా కంపెనీల ఆదాయం, లాభాలు 2019తో పోలిస్తే పెద్దగా మారలేదు. చైనాకు చెందిన 135 కంపెనీల సగటు లాభం 3.54 బిలియన్ డాలర్లుగా నమోదయింది.