కరోనా ఎఫెక్ట్: ఒకే లొకేషన్ నుండి రిలయన్స్ 1000 టన్నుల ఆక్సిజన్
కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగాఆక్సిజన్కు డిమాండ్ పెరిగింది. ఆక్సిజన్ అందక కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొలి దశతో పోలిస్తే కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ తన ప్లాంట్స్ను క్లోజ్ చేసి, ఆక్సిజన్ను అందించేందుకు ముందుకు వచ్చింది. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ముందుకు వచ్చింది.
ముఖేష్ అంబానీ ఏమన్నారంటే
రిలయన్స్ ఇండస్ట్రీస్ కేవలం ఒకే లొకేషన్ నుండి భారీ ఆక్సిజన్ తయారీకి ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ స్పందించారు. తనకు, తనతో పాటు రిలయన్స్లో పనిచేస్తోన్న ప్రతి ఒక్కరికీ దేశంలోని ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడడం తప్ప మరేదీ ముఖ్యం కాదని, ఈ కరోనా మలి దశలో దేశంతో పాటు మేం కూడా యుద్ధంలో పాల్గొంటామని, మెడికల్ ఆక్సిజన్ విషయంలో భారత ఉత్పత్తి, రవాణాను భారీగా పెంచడం తక్షణ అవసరమని ముఖేష్ అంబానీ అన్నారు.
11 శాతం ఉత్పత్తి
రిలయన్స్ తన మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని సున్నా నుండి రోజుకు 1000 టన్నులకు పెంచింది. తద్వారా ఒకే ప్రాంతం వద్ద లిక్విడ్ ఆక్సిజన్ భారీ ఎత్తున తయారు చేస్తోన్న అతిపెద్ద తయారీ కంపెనీగా నిలిచింది. దీంతో దేశంలో తయారవుతోన్న మొత్తం వైద్య సంబంధిత ద్రవీకృత ఆక్సిజన్లో రిలయన్స్ 11 శాతానికి పైగా ఉత్పత్తి చేస్తోంది. సాధారణంగా రిలయన్స్ ఆక్సిజన్ తయారీలో లేదు. కరోనా వంటి ఆపద సమయంలో దేశంలోనే అతిపెద్ద తయారీదారుగా అవతరించింది. రోజుకు వెయ్యి టన్నుల వరకు మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తోంది.
కంటైనర్ల రాక
గుజరాత్లోని జామ్ నగర్ నుండి ఈ ఉత్పత్తి పెంపు, రవాణాపై ముఖేష్ అంబానీయే వ్యక్తిగతంగా దృష్టి పెట్టినట్లు రిలయన్స్ తెలిపింది. ఏప్రిల్ నెలలో కంపెనీ 15,000 టన్నుల ఆక్సిజన్ను ఉచితంగా సరఫరా చేసింది. సౌదీ అరేబియా, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, థాయ్లాండ్స్ నుండి ఆక్సిజన్ను రవాణా చేసే 24 కంటైనర్లను విమానాల ద్వారా తీసుకు వచ్చింది. దీంతో భారత్కు 500 టన్నుల అదనపు రవాణా సామర్థ్యం పెరిగింది.