సంక్షోభంలో రియల్టర్లు ...నో రొటేషన్ .. కరోనా టైం లో కొనుగోళ్లకు కస్టమర్ల అనాసక్తి
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయింది. బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్న చాలామంది బిల్డర్లు, డబ్బు రొటేషన్ కాక ఇబ్బంది పడుతున్నారు. అపార్ట్మెంట్లను కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డర్లు పెట్టుబడులకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది.
కరోనా వైరస్ మానవ సమాజంపై తన ప్రభావాన్ని చూపడమే కాకుండా అందరిని ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసింది.
దీంతో ప్రస్తుతం అపార్ట్ మెంట్ లు కొనుగోలు చేయడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మరోపక్క అపార్ట్మెంట్ల నిర్మాణానికి డెవలప్మెంట్ ఎగ్రిమెంట్ చేసుకున్న బిల్డర్లు, అందుకు తగినట్లుగా సమయాభావం కాకుండా నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్లాట్లు కొనుగోలు చేసేవారు లేక, తిరిగి నిర్మాణాలకు పెట్టుబడులు పెట్టాల్సి రావడంతో బిల్డర్ ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఒక ఇబ్బందికర వాతావరణం రియల్ ఎస్టేట్ రంగంలో కొనసాగుతుంది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ తగ్గితేనే తప్ప తిరిగి బిజినెస్ చేయలేం అన్న భావనలో బిల్డర్లు ఉన్నారు.

ఒకపక్క బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితులు, మరోపక్క నిర్మాణాలకు పెట్టుబడులు, ఇంకోపక్క ఆసక్తి చూపని కస్టమర్లతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోంది. వీటికి తగ్గట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి తీసుకురావడం వంటి అంశాలు రియల్టర్లకు పెద్ద తలనొప్పిగా మారాయి. వ్యాపార లావాదేవీలు ఆగకుండా కొనసాగుతుంటేనే రియల్టర్లు పని చేసుకోగలుగుతారని, కానీ కరోనా కారణంగా ఒక్కసారిగా వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయని లబోదిబోమంటున్నారు. మొత్తంగా చూస్తే కరోనా వ్యాక్సిన్ వచ్చి, కరోనా కష్టాలు గట్టెక్కితేనే బిజినెస్ లు సాగుతాయి అన్నది రియల్టర్ల భావన.


Click it and Unblock the Notifications