RBI Warning: వాళ్లకు అప్పులిచ్చేటప్పుడు జాగ్రత్త.. బ్యాంకులను హెచ్చరించిన రిజర్వు బ్యాంక్..
RBI Warning: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు సెంట్రల్ బ్యాంకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆ క్రమంలోనే రిజర్వు బ్యాంక్ ఈ ఏడాది ఐదవసారి వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది అన్ని రకాల రుణాలపై ప్రభావాన్ని చూపుతోంది. అయితే ఈ క్రమంలో బ్యాంకులు రుణాల వితరణ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా తెలుస్తోంది.
భారతీయ రిజర్వు బ్యాంక్..
ప్రపంచంలోని పలు దేశాలను ఆర్థిక మాంద్యం ఆవరించిన వేళ ఆర్బీఐ చర్యలను కట్టుదిట్టం చేసింది. ఈ క్రమంలో దేశంలోని బ్యాంకులకు ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే చాలా కాలం తర్వాత దేశీయ బ్యాంకింగ్ రంగంలోని అనేక బ్యాంకులు నష్టాల భారాన్ని తగ్గించుకుని లాభాల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో మెుండి బకాయిల బరువు తగ్గించుకున్నాయి. అందువల్ల వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో బ్యాంకులు రిస్క్ తీసుకునే విషయంపై రిజర్వు బ్యాంక్ కీలక సూచనలు చేసింది.
సూచన ఏమిటంటే..
బ్యాంకులు తమ వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో జాగ్రత్తగా ఉండాలని సెంట్రల్ బ్యాంక్ సూచించింది. ఈ నేపథ్యంలో యూరప్, అమెరికా మార్కెట్లకు గణనీయమైన ఎక్స్పోజర్ కలిగి ఉన్న కంపెనీలకు రుణాలను ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలని బ్యాంకులని RBI కోరింది. రష్యా ఉక్రెయిన్ వివాదం ప్రారంభంతో అందులో ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో భాగస్వాములైన యూఎస్, యూకే ప్రస్తుతం దాని ప్రభావాన్ని చూస్తున్నందున ఈ జాగ్రత్తలు చేసినట్లు సమాచారం.
సులభ వాణిజ్యం కోసం..
ఆందోళనలు ప్రారంభమైన తర్వాత రష్యాతో పాటు ఇతర దేశాలతో చెల్లింపులు రూపాయి మారకంగా చేయాలని భారత్ నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతాలను తెరవడానికి కేంద్రం ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులను అనుమతించింది. ఇది వాణిజ్యాన్ని సులభతరం చేయటంతో పాటు, రూపాయి పతనాన్ని అరికట్టేందుకు దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యుద్ధం ప్రారంభంతో రష్యాపై అమెరికా, పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించి మాస్కోకు SWIFT మెసేజింగ్ సిస్టమ్ను నిలిపివేశాయి. అందువల్ల రష్యాకు చేయాల్సిన చెల్లింపుల్లో కలిగే అవాంతరానికి విరుగుడుగా భారత్ ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుందని సమాచారం.
భయపడుతున్న బ్యాంకులు..
రూపాయి చెల్లింపు వ్యవస్థను అమలు చేసేందుకు దిగ్గజ బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ తమ వ్యాపారాలపై ఆంక్షలు పడితే ఇబ్బంది కలుగుతుందని భావించి వోస్ట్రో ఖాతాల విషయంలో మౌనంగా ఉన్నాయి. ఇదే సమయంలో UCO బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్ వంటి బ్యాంకులు రష్యన్ భాగస్వామి బ్యాంకుల ద్వారా 12 ప్రత్యేక వోస్ట్రో ఖాతాలు తెరిచాయి. ఏదేమైనప్పటికీ.. దేశీయ మార్కెట్లో రుణ వృద్ధి ఆరోగ్యకరంగా కొనసాగించాలని ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ నవంబర్ లో జరిగిన సమావేశంలో అన్ని బ్యాంకులకు సూచించింది. రుణాల విషయంలో సెక్టోరల్ కోటాను కొనసాగించాలని కోరింది.