మారటోరియం పొడిగింపు లేనట్టే - 31తో డెడ్ లైన్ పూర్తి - ఉద్యోగాలు కోల్పోయినవాళ్ల మాటేంటి?
పలురకాల రుణాలపై మారటోరియం (చెల్లింపులకు విరామం) గడువును మరింత పొడిగించే అవకాశాలు లేనట్లే కనిపిస్తోంది. కరోనా సంక్షోభ కాలంలో రుణగ్రహీతలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపకుండా కేవలం మారటోరియం గడువును మాత్రమే పెంచుకుంటూ పోతే రుణాలపై వారి వైఖరిలో మార్పులు రావచ్చని, తద్వారా ఉద్దేశపూర్వక ఎగవేతలు పెరగొచ్చని ఆర్బీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కరోనా సంక్షోభం, దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా రుణాలు పొందినవారికి ఊరట కల్పించేందుకు ఆర్బీఐ.. తొలుత మార్చి 1 నుంచి మే 31 వరకు మారటోరియం ప్రకటించగా, ఆ తర్వాత గడువును మరో మూడు నెలలు పెంచి ఆగస్టు 31 వరకు పొడిగించింది. అయితే మరోసారి మారటోరియం గడువు ను పొడగించొద్దని, ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్, హెచ్డీఎ్ఫసీ చైర్మన్ దీపక్ పరేఖ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ సహా పలు ప్రముఖ బ్యాంకు చీఫ్ లూ ఆర్బీఐని వేడుకుంటున్నారు.
మారటోరియం పొడగింపును కొందరు అవకాశంగా తీసుకునే ప్రమాదముందని, స్తోమత ఉన్నప్పటికీ రుణగ్రహీతలు ఈ వసతిని దుర్వినియోగం చేస్తున్నారని బ్యాంకుల అధినేతలు అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ అన్లాక్తో వ్యాపార, కార్పొరేట్ రంగ కార్యకలాపాలు క్రమంగా గాడిన పడుతున్నాయని, ఆదాయ పునరుద్ధరణతో మారటోరియం లో ఉన్న రుణఖాతాలూ తగ్గాయని బ్యాంకర్లు అంటున్నారు. అయితే, ఉపాధి కోల్పోయిన అసంఘటిత వర్గాలు కాకుండా, వేతం పొందే వర్గాల్లోనూ సుమారు కోటి మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు రిపోర్టులు వెల్లడవుతోన్న వేళ ఆర్బీఐ, బ్యాంకులు తదుపరి ఎలాంటి చర్యలకు దిగుతాయనేది చర్చనీయాంశమైంది.
నిజానికి, ఆర్థికంగా ఇప్పటికీ గడ్డు పరిస్థితుత్ని ఎదుర్కొంటున్నవారు, ఇప్పట్లో ఆదాయం పెరిగే అవకాశంలేని కంపెనీలకు ఆర్బీఐ ఇదివరకే ప్రకటించిన ఏకకాల రుణ పునర్వ్యవస్తీకరణ (వన్టైం లోన్ రీస్ట్రక్చర్) ఏమేరకు ఫలితాన్నిస్తుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేట్తోపాటు రిటైల్ రుణ గ్రహీతలూ ఈ వసతిని ఉపయోగించుకోవచ్చని ఈనెలలో నిర్వహించిన పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంకులు వీరికి రుణ చెల్లింపుల గడువును గరిష్ఠంగా రెండేళ్లపాటు పొడిగించవచ్చని స్పష్టం చేసింది. అయితే, ఈ లోన్ రీస్ట్రక్చర్ అవసరమైన, అర్హులైన వారికి మాత్రమే వర్తింపజేయాలని బ్యాంకులకు నిర్దేశించింది.