భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 424 పాయింట్లు జంప్
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు (మే 5 బుధవారం) భారీ లాభాల్లో ముగిశాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ లిక్విడిటీ మెజర్స్ నేపథ్యంలో సూచీలు పైపైకి ఎగిశాయి. ఆర్బీఐ గవర్నర్ ప్రెస్ మీట్ ఉందని తెలియడంతోనే ఉదయం నుండి మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. ఆ తర్వాత ఏ దశలోను తిరిగి చూడలేదు. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా, నిఫ్టీ 120 పాయింట్లకు పైగా లాభంతో ముగిసింది. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడాయి. కానీ కేంద్రం చర్యలు, ఆర్బీఐ ప్రకటన నేపథ్యంలో సానుకూలంగా ముగిశాయి.
భారీ లాభాల్లో..
సెన్సెక్స్ నేడు 48,569.12 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,742.72 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,254 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 424 (0.88%) పాయింట్లు ఎగిసి 48,677 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,604.15 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,637.90 వద్ద గరిష్టాన్ని, 14,506.60 వద్ద కనిష్టాన్ని తాకింది. చవరకు నిఫ్టీ 121.35 (0.84%) పాయింట్లు ఎగిసి 14,617.85 పాయింట్ల వద్ద ముగిసింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో సన్ ఫార్మా 5.93 శాతం, UPL 4.82 శాతం, యాక్సిస్ బ్యాంకు 2.41 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.31 శాతం, కొటక్ మహీంద్రా 2.20 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్ 3.99 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.79 శాతం, SBI లైఫ్ ఇన్సురెన్స్ 1.00 శాతం, ఏషియన్ పేయింట్స్ 0.75 శాతం, HUL 0.73 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, సన్ ఫార్మా, ఎస్బీఐ ఉన్నాయి.
రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.84 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.89 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.59 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.59 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.68 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.62 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.22 శాతం, నిఫ్టీ ఐటీ 1.17 శాతం, నిఫ్టీ మీడియా 0.43 శాతం, నిఫ్టీ మెటల్ 0.99 శాతం, నిఫ్టీ ఫార్మా 4.12 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 1.47 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.55 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియాల్టీ 1.00 శాతం నష్టపోయింది.