డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడాలి: ఆర్బీఐ శక్తికాంతదాస్
డిపాజిటర్ల ప్రయోజనాలను, ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకొని రుణ పునర్వ్యవస్థీకరణ పథకాన్ని రూపొందించామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) శక్తికాంత దాస్ బుధవారం అన్నారు. ఫిక్కీ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ బ్యాంకింగ్ వ్యవస్థకు అయినా డిపాజిటర్ల ప్రయోజనాలు చాలా ముఖ్యమని చెప్పారు. రుణ పునర్నిర్మాణాలపై పరిశ్రమ అందించే సలహాలను పరిశీలిస్తున్నామన్నారు.
సంక్షోభంలో మన పరిశ్రమలు మెరుగ్గా స్పందిస్తున్నాయి: దాస్
డిపాజిటర్ల ప్రయోజనాలను, ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకొని రుణ పునర్నిర్మాణ ప్రణాళికలను రచించినట్లు శక్తికాంతదాస్ తెలిపారు. జాగ్రత్తగా, సమతౌల్యంగా తీసుకున్న నిర్ణయం ఇది అన్నారు. గతంలో బ్యాంకులు మొండి బకాయిల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. వ్యాపారాలు పుంజుకోవడంతో పాటు ఎన్పీఏలు తక్కువగా ఉంటేనే ఆర్థిక రికవరీ వేగంగా ఉంటుందన్నారు. విద్య, ఆరోగ్య వసతులను పెంచుకోవడం వల్ల కూడా ఆర్థిక అభివృద్ధి సాధ్యమన్నారు. కొన్ని రంగాల్లోనే పురోగతి కనిపిస్తోందని, కాబట్టి ఆర్థిక పునరుద్ధరణ క్రమంగా మాత్రమే ఉంటుందన్నారు.
2008-09లో ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఆర్బీఐ వివిధ చర్యలు తీసుకుందని, కానీ 2014-15లో బ్యాడ్ లోన్స్కు దారి తీసిందని చెప్పారు. బ్యాంకుల ప్రధాన ఆందోళన డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడటం అన్నారు. బ్యాంకుల్లో డిపాజిటర్ల డబ్బు ఉందని, కోట్లాది మంది డిపాజిటర్లు ఉన్నారని, రుణగ్రహీతలు లక్షల్లో ఉండవచ్చునని చెప్పారు. చిన్న డిపాజిటర్లు, మధ్యతరగతి ప్రజలు, డిపాజిట్ ఆదాయంపై ఆధారపడిన రిటైర్డ్ వ్యక్తులు ఉన్నారన్నారు. వారి ప్రయోజనాలను కాపాడాల్సి ఉందన్నారు.