రుణగ్రహీతల అకౌంట్లలోకి డబ్బులు! చక్రవడ్డీ మాఫీని వెంటనే అమలు చేయాలి: ఆర్బీఐ
ముంబై: కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాపారుల నుండి ఉద్యోగుల వరకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని (వడ్డీపై వడ్డీ) మాఫీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో రుణాలపై వడ్డీపై వడ్డీని మాఫీ చేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ సూచించింది. నిర్దేశించిన సమయంలోగా బ్యాంకులు దీనిని అమలు చేయాలని తెలిపింది.
లోన్ మారటోరియం గుడ్న్యూస్: ఎవరు అర్హులు, ఎంత లబ్ధి? EMI చెల్లించిన వారికి ప్రయోజనం ఎంత?
నవంబర్ 5లోగా రుణగ్రహీతల ఖాతాల్లో జమ
లోన్ మారటోరియం కాలంలో రుణాలపై చక్రవడ్డీకి బదులు సాధారణ వడ్డీని వసూలు చేస్తామని, వడ్డీపై వడ్డీని వెనక్కు ఇస్తామని భారత అత్యున్నత న్యాయస్థానానికి కేంద్రం అఫిడవిట్ సమర్పించింది. మారటోరియం 6 నెలల కాలంలో ఈఎంఐలను చెల్లించిన వారికి చక్రవడ్డీ, సాధారణవడ్డీల మధ్య వ్యత్యాసాన్ని నవంబర్ 5లోగా రుణగ్రహీతల ఖాతాల్లో జమ చేయనున్నారు. బ్యాంకులు రుణగ్రహీతల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేయగా, తర్వాత ప్రభుత్వం బ్యాంకులకు దానిని అందిస్తుంది. మారటోరియం కాలంలో ఈఎంఐలపై చక్ర వడ్డీ కాకుండా సాధారణ వడ్డీనే వసూలు చేయాలని ఈ వ్యత్యాసాన్ని అర్హులైన రుణగ్రహీతల ఖాతాల్లో వేయాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోగా, 21న కేబినెట్ ఆమోదించింది. రూ.2 కోట్లలోపు రుణాలపై చక్రవడ్డీని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
మాఫీ వీరికే...
మార్చి 1వ తేదీ నుండి ఆగస్ట్ 31వ తేదీ వరకు ప్రకటించిన మారటోరియంపై చక్రవడ్డీ మాఫీ ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 29వ తేదీ నాటికి రూ.2 కోట్ల లోపు రుణఖాతాలు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. చక్రవడ్డీ మాఫీ వర్తించాలంటే ఫిబ్రవరి 29వ తేదీ నాటికి సదరు రుణ ఖాతా మొండి బకాయిగా ఉండరాదు. హోమ్ లోన్, హౌసింగ్ లోన్, ఎంఎస్ఎంఈ రుణాలతో పాటు వినియోగ రుణాలు, గృహోపకరణాల కొనుగోలు రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలు చక్రవడ్డీ మాఫీ పథకం పరిధిలోకి వస్తాయి. సాధారణ వడ్డీకి, చక్రవడ్డీకి మధ్య తేడా నగదును బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అర్హులైన రుణ గ్రహీతల ఖాతాల్లో జమ చేయాలి. నవంబర్ 5వ తేదీలోగా ఈ చెల్లింపు ప్రక్రియ పూర్తి కావాలి. జమ చేసిన ఈ సొమ్మును కేంద్రం భరిస్తుంది. కేంద్రం రుణదాతలకు ఇస్తుంది. ప్రభుత్వరంగ, ప్రైవేటురంగ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు, సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న వారు అందరూ అర్హులే.
పండుగ గిఫ్ట్...!
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ఈఎంఐల చెల్లింపులపై ఆర్బీఐ మూడు నెలల పాటు మారటోరియం విధించింది. ఆ తర్వాత రెండోసారి జూన్ నెలలో మరో మూడు నెలల పాటు మారటోరియాన్ని పొడిగించింది. ఈ మారటోరియం కాలానికి గాను చక్రవడ్డీ వసూలు చేయరాదని పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వడ్డీపై వడ్డీని వెనక్కి తీసుకుంటామని కేంద్రం తెలిపింది. అయితే చక్రవడ్డీపై కేంద్రం నిర్ణయం ఆలస్యమవుతుండటంతో త్వరగా నిర్ణయం తీసుకోవాలని, ప్రజల దీపావళి మీ చేతుల్లో ఉందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. త్వరగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు అక్టోబర్ 14న కేంద్రం, ఆర్బీఐకి సూచించింది. కేంద్రం మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పై మార్గదర్శకాలు జారీ చేసింది.