కరోనా ఎఫెక్ట్, ఏప్రిల్ 1 నుండి వడ్డీ రేట్లు భారీగా తగ్గే అవకాశం
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. ఇటీవల ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వడ్డీ రేట్లు తగ్గించేందుకేనని అంతా భావించారు. కానీ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ త్వరలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు ఉన్నాయని రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్బీఐ 175 బేసిక్ పాయింట్ల వడ్డీ రేటు తగ్గించవచ్చునని ఫిచ్ సొల్యూషన్స్ అంచనా వేసింది.
Yes bank crisis: హఠాత్తుగా ఆరో అతిపెద్ద బ్యాంకుగా.. 13 రోజుల్లోనే
ఆర్బీఐ రెపో రేటు 1.75 శాతానికి తగ్గింపు..
2020-21 ఆర్థిక సంవత్సరానికి గాని ఆర్బీఐ రెపో రేటును 1.75 శాతానికి తగ్గించవచ్చునని ఫిచ్ అంచనా వేసింది. దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం నెలకొనడం, కరోనా మూలంగా మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం కావడంతో వీటిని ఎదుర్కొనేందుకు ఆర్బీఐ ఈ చర్య తీసుకోవచ్చునని తెలిపింది. 175 బేసిస్ పాయింట్లు తగ్గిస్తే భారీగా తగ్గించినట్లే అవుతుంది.
3.40 శాతానికి తగ్గనున్న రెపో రేటు
అంచనా ప్రకారం ఆర్బీఐ వడ్డీ రేటును 1.75 శాతానికి తగ్గిస్తే అప్పుడు రెపో రేటు 3.40 శాతానికి, రివర్స్ రెపో రేటు 3 శాతానికి చేరుకుంటుంది. ప్రస్తుతం రెపో రేటు 5.15 శాతం, రివర్స్ రెపో రేటు 4.75 శాతంగా ఉంది. 2020-21లో భారత వాస్తవ జీడీపీలో వృద్ధి 5.4 శాతం ఉండవచ్చునని ఫిచ్ తెలిపింది.
ఏప్రిల్ 15 వరకు కష్టమే..
కరోనా మహమ్మారి మరో నెల రోజుల పాటు ఉండే అవకాశముందని బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ (BofA) తన తాజా నివేదికలో పేర్కొంది. జనవరి - మార్చి క్వార్టర్లో భారత జీడీపీ రేటు 4 శాతం దాటక పోవచ్చునని తెలిపింది. ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు 2.2 శాతానికి పడిపోతే సంవత్సరం మొత్తం మీద వృద్ధి రేటు 4.7 శాతం దాటే అవకాశం లేదని అంచనా వేసింది.