RBI new rules: టోకెనైజేషన్ గడువు జూన్ చివరి వరకు పొడిగింపు
డెబిట్, క్రెడిట్ కార్డ్స్ టోకెనైజేషన్ గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వచ్చే ఏడాది జూన్ నెలాఖరు వరకు పొడిగించింది. గురువారం ఈ మేరకు సర్క్యులర్ను జారీ చేసింది. అఫ్పటి నుండి కార్డులు జారీ చేసే బ్యాంకులు, కార్డు నెట్ వర్క్స్ సంస్థలు తప్ప వ్యాపారసంస్థలు ఏవీ డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు స్టోర్ చేసేందుకు అనుమతించేది లేదని ఆ సర్క్యులర్లో తెలిపింది. ఈ నెలాఖరు నుండి దేశంలో టోకెనైజేషన్ అమలు చేయాలని ఆర్బీఐ భావించింది. అయితే ఈ గడువును పొడిగించాలని బ్యాంకులు, ఇతర సంస్థల నుండి విజ్ఞప్తి రావడంతో జూన్ నెలాఖరు వరకు గడువును పెంచూతూ నిర్ణయం తీసుకున్నది. టోకెనైజేషన్కు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ, చిన్న, మధ్య తరహా వ్యాపారులు, వ్యాపార సంస్థలు సిద్ధం కావడానికి సమయం కావాలని బ్యాంకులు చెబుతున్నాయి.
గడువు పొడిగింపు అంశంపై ఆలోచన చేయాల్సిందిగా బ్యాంకులు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA) ప్రతినిధులు ఆర్బీఐకి విడివిడిగా లేఖలు రాశారు. మైక్రోసాఫ్ట్, నెట్ ఫ్లిక్స్, స్పాటిఫై, బుక్మై షో, డిస్నీ+హాట్ స్టార్ వంటి సంస్థలకు సభ్యత్వం ఉన్న మర్చంట్ పేమెంట్స్ అలెయన్స్ ఆఫ్ ఇండియా, పేటీఎం, మ్యాట్రిమొనీ డాట్ కామ్, మ్యాప్మై ఇండియాలు సభ్యులుగా ఉన్న అలయన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్ కూడా ఆర్బీఐకి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ఆర్బీఐ గడువును పొడిగించింది.
ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డులతో ట్రాన్సాక్షన్స్ నిర్వహించేటప్పుడు 16 అంకెల కార్డు నెంబర్, ఎక్స్పైరీ తేదీ, సీవీవి వంటి వివరాలు నమోదు చేయాలి. వీటికి అదనంగా మొబైల్కు వచ్చే ఓటీపీ జమ చేస్తే ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. దీంతో కార్డు హోల్డర్స్ సున్నిత ఆర్థిక వివరాలు మర్చంట్ ప్లాట్ ఫామ్స్, పేమెంట్ గేట్వేలలో నిక్షిప్తమవుతున్నాయి. అన్ని ప్లాట్ ఫామ్స్ ఇదే విధానం అవలంభిస్తున్నాయి. వినియోగదారుల సున్నిత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు సేకరించి, మోసాలకు కారణమవుతుంది. ఇప్పుడు టోకెనైజేషన్ వల్ల ట్రాన్సాక్షన్ సులభమవుతుంది.