RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. గడువుకు ముందే అత్యవసర మీటింగ్.. రెడీ ఫర్ షాక్..!
RBI: సాధారణంగా రిజర్వు బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీ రెండు నెలలకు ఒకసారి మీటింగ్ నిర్వహిస్తుంది. ఈ క్రమంలో కీలక వడ్డీరేట్లపై నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఈ సారి గడువుకు ముందుగానే.. నవంబర్ 3న దీనిని నిర్వహిస్తున్నటాలు RBI గురువారం జారీ చేసిన నోటిఫికేషన్లో వెల్లడించింది.
ద్రవ్యోల్బణం..
రూపాయి మారకపు విలువ డాలర్ తో పోల్చినప్పుడు కనిష్ఠాలకు పడిపోవటం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనికి తోడు చర్యలు కఠినంగా తీసుకుంటున్నప్పటికీ.. ద్రవ్యోల్బణం పెరగటం మరింత ఆందోళనను కలిగిస్తోంది. అందుకే వీటిపై చర్చించి భారత ఆర్థిక, వాణిజ్య వృద్ధికి దోహదపడే వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నంలో ముందస్తు మీటింగ్ జరుగుతోంది.
శక్తికాంత దాస్..
ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ ఏడాది మే నెలలో తొలిసారిగా అత్యవసర ద్రవ్య విధాన సమావేశానికి పిలుపునిచ్చారు. ఇప్పుడు రెండోసారి అదే పిలుపునివ్వటం ద్రవ్యోల్బణ తీవ్రతకు అద్ధం పడుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈసారి సమావేశం డిసెంబర్ 5-7 మధ్య మూడు రోజులు జరగాల్సి ఉంది. చివరిగా ద్రవ్య విధాన సమావేశం సెప్టెంబర్ 28-30 వరకు జరిగాయి.
మళ్లీ రెపోరేటు పెరుగుతుందా..?
దారికి రాని ద్రవ్యోల్బణం, పడిపోతున్న రూపాయి రక్షణ ఇప్పుడు ఆర్బీఐకి చాలా కీలకంగా మారింది. ఇది రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయటంతో పాటు విదేశీ చెల్లింపుల భారాన్ని పెంచుతుంది. ఈ క్రమంలో మరోసారి వడ్డీ రేట్లపెంపు అనివార్యమని తెలుస్తోంది. ఇప్పటికే రెపో రేటు అనేక మార్లు పెరిగిన తర్వాత 5.90 శాతానికి చేరుకుంది.
భారత వృద్ధి అంచనాలు..
2023 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయటం జరిగింది. ఇదే క్రమంలో జీడీపీలో ద్రవ్యలోటు 6.5 శాతం, కరెంట్ ఖాతా లోటు 3.6 శాతంగా ఉంటుందని కేర్ఎడ్జ్ ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. అయితే ప్రస్తుత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని తిరిగి రిజర్వు బ్యాంక్ బ్రాకెట్ అయిన 4%-6% శాతానికి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.