కరోనా థర్డ్ వేవ్, భారత ఆర్థిక వ్యవస్థపై రాకేష్ ఝున్ఝున్వాలా ఏమన్నారంటే?
భారత్ లాంగ్ టర్మ్పై ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలా ఆశావాహ దృక్పంథంతో ఉన్నారు. ఇటీవల మార్కెట్లు ఊగిసలాటలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. మార్కెట్లో ఇటీవల కనిపించిన దిద్దుబాట్లు, ద్రవ్యోల్భణం వంటి అంశాలపై పెట్టుబడిదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. భారత్లో బుల్ మార్కెట్ కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, కరోనా థర్డ్ వేవ్ గురించి ఎలాంటి ఆందోళన లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా థర్డ్ వేవ్ ద్వారా వచ్చే మార్కెట్ స్లోడౌన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
బుల్ మార్కెట్లో దిద్దుబాటు
చిన్న చిన్న దిద్దుబాటులకు ఇన్వెస్టర్లు భయపడాల్సిన అవసరం లేదని రాకేష్ ఝున్ఝున్వాలా చెప్పారు. గతవారం 15900 స్థాయికి చేరిన నిఫ్టీ, సోమవారం 15500-15765 మధ్య కదలాడిందని, చివరకు 15747 పాయింట్ల వద్ద ముగిసిందని గుర్తు చేశారు. 2004-08 నాటి బుల్ మార్కెట్కు ముందు అంటే 2002-03లో కలిగిన అనుభూతే ఇప్పుడు కలుగుతోందని, ఈసారి బుల్ మార్కెట్ ఆరేళ్లు కాదు.. దశాబ్దాల కొద్ది కొనసాగుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బుల్ మార్కెట్లో దిద్దుబాట్లు ఉంటాయన్నారు.
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఉండదు...
కరోనా థర్డ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతుందని తాను భావించడం లేదన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతిని ఎవరూ అంచనా వేయలేదని, ఇపుడు థర్డ్ వేవ్ గురించి మాట్లాడుతున్నారని, వ్యాక్సీనేషన్ వేగాన్ని అందుకుందని, రోగనిరోధక శక్తి పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతుందని తాను భావించడం లేదన్నారు. ఆర్థిక వ్యవస్థ ఇపుడు గతంలో కంటే మెరుగ్గా సిద్ధమైందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు దీర్ఘకాలంలో సానుకూల ప్రభావాన్ని చూపుతాయన్నారు. అందుకే భారత ఆర్థిక వ్యవస్థపై బులిష్గా ఉన్నట్లు తెలిపారు.
వ్యాక్సినేషన్
జూన్ 20 నాటికి భారత్ వ్యాక్సినేషన్ 28,00,36,898 డోసులుగా నమోదయింది. అలాగే, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 29.35 కోట్ల వ్యాక్సీన్ డోస్లు కేటాయించారు. థర్డ్ వేవ్ ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు కానీ భారత ఎకానమీ మాత్రం అందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సమయంలో సెకండ్ వేవ్ దెబ్బతీసిన విషయం తెలిసిందే. సెకండ్ వేవ్ తగ్గి మరోసారి భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది.