Rakesh Jhunjhunwala: రూ.కోట్లు కురిపించిన ఆ కంపెనీ షేర్లు అమ్ముకున్న స్టార్ ఇన్వెస్టర్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో రాకేష్ ఝున్ఝున్వాలా పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. స్టార్ ఇన్వెస్టర్గా గుర్తింపు పొందారు. ఇండియన్ వారెన్ బఫెట్గా పిలుస్తారు. షేర్ మార్కెట్లో ఆయన వేసే అంచనాలు నిజం అవుతుంటాయని చెబుతుంటారు. షేర్ల భవిష్యత్ ఎలా ఉండబోతోందనే విషయాన్ని అంచనా వేయడంలో దిట్ట. దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంటారు. ఇలా ఇన్వెస్ట్ చేసిన పోర్ట్ఫోలియోలు లాభాల బాటలో పట్టాయి.
డెల్టా కార్ప్ షేర్ల విక్రయం..
అలాంటి ఏస్ స్టాక్ ఇన్వెస్టర్- తాను పెట్టుబడులు పెట్టిన ఓ కంపెనీకి చెందిన షేర్లను భారీగా అమ్ముకున్నారు. అయిదు రోజుల వ్యవధిలో వాటన్నింటినీ స్టాక్ ఎక్స్ఛేంజ్లో సేల్ చేశారు. ఆ కంపెనీ- డెల్టా కార్ప్. ఈ కంపెనీ జారీ చేసిన పబ్లిక్ ఇష్యూల్లో రాకేష్ ఝున్ఝున్వాలా కొనుగోలు చేసిన స్టాక్స్ శాతం.. 7.1. ఆయన భార్య రేఖా ఝున్ఝున్వాలాకు ఉన్న స్టేక్స్ను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య 7.5 శాతానికి చేరుతుంది.
25 లక్షల షేర్లు విక్రయం..
ఇందులో తన వాటాను 6.2కు కుదించుకున్నారు రాకేష్ ఝున్ఝున్వాలా. 0.9 శాతంతో ఏకంగా 25 లక్షల షేర్లను విక్రయించారు. ఈ విషయాన్ని ఆయన కొద్దిసేపటి కిందటే రెగ్యులేటరీకి తెలియజేశారు. కిందటి నెల 27,28,28,30,31 తేదీల్లో తాను డెల్టా కార్ప్కు చెందిన 25 లక్షల షేర్లను విక్రయించినట్లు వివరించారు. 2016 నవంబర్లో ఝున్ఝున్వాలా తన భార్య రేఖతో కలిసి 10 శాతం స్టేక్స్ను కొనుగోలు చేశారు.
6.2 శాతంగా..
ఆ మరుసటి ఏడాది నుంచి అంటే 2017 అక్టోబర్ నుంచి కిందటి నెల 31వ తేదీ వరకు 57,50,000 షేర్లను విక్రయించారు. దీనితో వారిద్దరి వాటా ప్రస్తుతం డెల్టా కార్ప్లో 6.2 శాతానికి తగ్గినట్టయింది. వారి చేతిలో ఇంకా 1,65,00,000 షేర్లు ఉన్నాయి. రాకేష్ ఝున్ఝున్వాలా 25 లక్షల డెల్టా కార్ప్ షేర్లను విక్రయించుకోవడం మార్కెట్లో కలకలం రేపింది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఈ కంపెనీ నెట్ ప్రాఫిట్ తగ్గింది. 58 కోట్ల నుంచి 48 కోట్ల రూపాయలకు క్షీణించింది. ఇవ్వాళ డెల్టా కార్ప్ షేర్ ధర రూ.213.45 పైసల వద్ద ట్రేడ్ అయింది.
కోట్ల రూపాయల్లో లాభాలు..
టాటా గ్రూప్స్కు చెందిన టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్, రేటింగ్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ క్రిసిల్ వంటి పలు కంపెనీల్లో షేర్లను హోల్డ్ చేశారు. గత ఏడాదిలో టాటా మోటార్స్ ద్వారా ఆయన 17.82 కోట్ల రూపాయలను ఆర్జించారు. ఇందులో రాకేష్ ఝున్ఝున్వాలాకు 3.67 కోట్ల షేర్లు ఉన్నాయి. ఇండియన్ హోటల్స్-రూ.31.13 కోట్లు, క్రిసిల్-రూ. 21.72 కోట్లు, ఎస్కార్ట్స్-రూ.451 కోట్ల రూపాయల ప్రాఫిట్ను ఇచ్చాయి.