విలువలేదు: బిట్ కాయిన్, టెస్లా జంప్పై రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు
ముంబై: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ బిట్ కాయిన్, టెస్లా ఇంక్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. 2020 క్యాలెండర్ ఏడాదిలో క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ భారీగా ఎగిసిన విషయం తెలిసిందే. ఓ సమయంలో 5000 డాలర్ల వద్ద ఉన్న బిట్ కాయిన్ ఇప్పుడు ఏకంగా 41,000 దాటింది. ఇక టెస్లా ఇంక్ స్టాక్స్ 750 శాతం వరకు పెరిగాయి. దీంతో 2020 ప్రారంభంలో 30కి పైగా ర్యాంకులో ఉన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇప్పుడు నెంబర్ వన్కు ఎగబాకారు. దాదాపు గత నెల రోజుల్లోనే టాప్ 10లోకి, ఆ తర్వాత నెంబర్ 4.. నెంబర్ 3.. నెంబర్ 2.. దాటి జనవరిలో నెంబర్ 1కు వచ్చారు. బిట్ కాయిన్, టెస్లా భారీగా ఎగిసిపడటంపై రాజన్ స్పందించారు.
ఇదో క్లాసిక్ బుడగ
బిట్ కాయిన్ వ్యాల్యూ అంతకంతకూ పెరగడాన్ని రఘురాం రాజన్ బుడగతో పోల్చారు. మార్కెట్ పోకడలకు సంబంధించి ఇదో మంచి ఉదాహరణ అని, క్లాసిక్ బుడగ అన్నారు. బుధవారం 'ఈటీ నౌ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై మాట్లాడారు. ఓసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తే, గత ఏడాది ప్రారంభంలో 10వేల డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ వ్యాల్యూ నేడు ఏకంగా 40 వేల డాలర్లకు చేరుకుందని, వాస్తవానికి దీంతో ఎలాంటి వ్యాల్యూ ఉండదని, ఈ కరెన్సీ ద్వారా చెల్లింపులు చేయడం కష్టమేనని, అయినప్పటికీ బిట్ కాయిన్ ఇప్పటికే 40 వేల డాలర్లకు పైగా చేరుకుందని, భవిష్యత్తులో మరింత పెరుగుతుందని ఇన్వెస్టర్లు గట్టిగా నమ్ముతున్నారని, అందుకే బిట్ కాయిన్పై పెట్టుబడులు రోజురోజుకు పెరుగుతున్నాయని, కానీ ఇది క్లాసిక్ బుడగ వంటిదన్నారు.
ఆస్తిగా పరిగణించలేం
ఒకవేళ ప్రపంచం మరో సంక్షోభంలో చిక్కుకుంటే బిట్ కాయిన్తో పాటు టెస్లా కూడా గాలి బుడగ మాదిరి దూసుకెళ్తాయన్నారు. బుడగ వంటి మార్కెట్ ధోరణి, ద్రవ్యపరపతి విధానం సరళతరం, తక్కువ వడ్డీ రేట్లు వంటివి బిట్ కాయిన్ వ్యాల్యూ పెరగడానికి కారణమన్నారు. బిట్ కాయిన్ ఎంతగా పెరిగిన దానికి నిజమైన విలువ లేదని, ఒక ఆస్తిగా దీనిని పరిగణించి చెల్లింపులు జరపడం కష్టసాధ్యమన్నారు.
స్టాక్ మార్కెట్లపై హెచ్చరిక
స్టాక్ మార్కెట్లపై రఘురాం రాజన్ స్పందిస్తూ సెన్సెక్స్ 50వేల మార్కు దాటవచ్చునని అభిప్రాయపడ్డారు. ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఆర్థిక ఫలితాలే కారణమన్నారు. స్టాక్ మార్కెట్ల మాయలో పడొద్దన్నారు.
కరోనా సమయంలో కొన్ని పెద్ద కంపెనీలు మాత్రమే లాభపడ్డాయని, కానీ చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బతిన్నాయని, అసంఘటిత రంగంలో ఉద్యోగాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు.