చివరి త్రైమాసికం: బ్యాంకులకు కేంద్రం బంపర్ ఆఫర్: ఇక పండగే: వాటి సేకరణ..ఇలా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జాతీయ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయన్ని తీసుకుంది. ప్రభుత్వ రంగంలోని బ్యాంకులను ఆర్థికంగా మరింత ఊతం ఇచ్చేంతటి నిర్ణయం అది. వచ్చే మూడు నెలలకాలంలో మార్కెట్ నుంచి 25,000 కోట్ల రూపాయల మొత్తాన్ని సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి దేబాశీష్ పండా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ జాతీయ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. 2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం కాలానికి 25,000 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి వేర్వేరు రూపాల్లో సేకరించడానికి జాతీయ బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. రెగ్యులేటరీ మార్గదర్శకాలను అందుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
చివరి రెండు త్రైమాసిక కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 40,000 కోట్ల రూపాయల మొత్తాన్ని సమీకరించాయి. ఈక్విటీ, ఏటీ-1, టయర్-2 బాండ్ల రూపంలో ఇంత భారీ మొత్తాన్ని సమీకరించాయి. దీనికి అదనంగా మరో 20,000 నుంచి 25,000 కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి సేకరించడానికి అనుమతి ఇచ్చినట్లు దేబాశీష్ పండా వెల్లడించారు. ఇదివరకు కెనరా బ్యాంకు-2,000, పంజాబ్ నేషనల్ బ్యాంకు-3,788.04 కోట్ల రూపాయల మొత్తాన్ని క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ) ద్వారా సమీకరించాయి.
దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం మరో 20,000 కోట్ల రూపాయలను జాతీయ బ్యాంకుల్లో మూలధన పెట్టుబడిగా పెట్టింది. అయినప్పటికీ.. పంజాబ్ అండ్ సింద్ వంటి కొన్ని బ్యాంకులు రెగ్యులేటరీ మార్గదర్శకాలను అందుకోలేకపోయాయి. ఫలితంగా- పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరో 5,500 కోట్ల రూపాయలను మూలధన పెట్టుబడిగా ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసిన 2019-2020 ఆర్థిక సంవత్సరంలో జాతీయ బ్యాంకులు ఏకంగా 70,000 కోట్ల రూపాయలను సమీకరించాయి.
ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్-16,091, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-11,768, కెనరా బ్యాంక్-6,571, ఇండియన్ బ్యాంక్-2,534 కోట్ల రూపాయల వాటా నమోదు చేశాయి. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 11.. లాభాలను ఆర్జించినట్లు దేబాశీస్ పండా తెలిపారు. నిరర్ధక ఆస్తులు (నాన్ పెర్ఫార్మెన్స్ అసెట్స్-ఎన్పీఏ) తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి ఎన్పీఏ మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.