శ్రీలంకలో అదాని పవర్ ప్రాజెక్ట్ కలకలం: ఏకంగా మోడీపైనే ఆరోపణలు: రాహుల్ గాంధీ సైతం
న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానికి చెందిన అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు శ్రీలంకలో కేటాయించిన పవన విద్యుత్ ప్రాజెక్ట్.. ఇప్పుడు కలకలం రేపుతోంది. దీనిపై రాజకీయంగానూ దుమారం చెలరేగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకొచ్చిన ఒత్తిళ్ల వల్లే ఈ ప్రాజెక్ట్ను అదానికి కట్టబెట్టాల్సి వచ్చిందంటూ సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు దీనికి కారణం అయ్యాయి.
500 బిలియన్ డాలర్ల ప్రాజెక్ట్..
2021లో శ్రీలంక ప్రభుత్వం.. అదాని గ్రూప్స్కు కేటాయించిన పవన విద్యుత్ ప్రాజెక్ట్ ఇది. దీని ఉత్పాదక సామర్థ్యం 500 మెగావాట్లు. సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించడంలో ఈ ఒప్పందం కుదిరింది. శ్రీలంక తీర ప్రాంత జిల్లా మన్నార్లో దీన్ని నెలకొల్పడానికి గౌతమ్ అదానితో సిలోన్ ఎలక్ట్రసిటీ బోర్డ్, సస్టెయినబుల్ ఎనర్జీ అథారిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ వ్యయం 500 బిలియన్ డాలర్లు.
|
మోడీ ఒత్తిళ్ల వల్ల..
ఈ ప్రాజెక్టు కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వ సంస్థలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం (కోప్) నిర్వహించిన విచారణలో పలు కీలక అంశాలు బహిర్గతం అయ్యాయి. దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒత్తిడిని తీసుకురావడం వల్లే అదానీకి ఈ ప్రాజెక్టును కట్టబెట్టాల్సి వచ్చిందని సిలోన్ ఎలక్ట్రసిటీ బోర్డ్ ఛైర్మన్ ఎంఎంసీ ఫెర్డినాండో కుండబద్దలు కొట్టారు.
స్పందించిన గొటబయ..
ఈ ప్రకటనపై గొటబయ రాజపక్స స్పందించడం.. ప్రాధాన్యతను సంతరించుకుంది. దీన్ని ఆయన తోసిపుచ్చారు. దీనిపై వివరణాత్మక సమాధానం వెలువడుతుందని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో దీన్ని పోస్ట్ చేశారు. రాజపక్స వివరణ కోరిన నేపథ్యంలో- పార్లమెంటరీ కమిటీ సమక్షంలో తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ఎంఎంసీ ఫెర్డినాండో చెప్పారు.
|
గ్లోబల్ టెండర్లకు భిన్నంగా..
శ్రీలంకలో విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపుల కోసం గ్లోబల్ టెండర్లను పిలిచే వ్యవస్థ ఉంది. దీనికి భిన్నంగా నామినేషన్ పద్ధతిన మన్నార్ విండ్ పవర్ ప్రాజెక్ట్ను అదానికి కేటాయించిందంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. తాజాగా పార్లమెంటరీ కమిటీ ముందు ఎంఎం ఫెర్డినాండో చేసిన ప్రకటనతో ఈ ఆరోపణలు నిజమేనంటూ వార్తలొచ్చాయి.
|
బీజేపీ వైఖరిని తప్పుపట్టిన రాహుల్ గాంధీ..
దీనిపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ సైతం స్పందించారు. శ్రీలంక పవర్ ప్రాజెక్టులో మోడీ ప్రభుత్వం జోక్యం చేసుకుందంటూ విమర్శించారు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో దీనికి సంబంధించిన ఓ క్లిప్పింగ్ను పోస్ట్ చేశారు. బీజేపీ కుటిల రాజకీయాలు ఇప్పుడు పాక్ జలసంధిని కూడా దాటాయంటూ వ్యాఖ్యానించారు.
అదానీకి రెండో అతిపెద్ద ప్రాజెక్ట్..
అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు శ్రీలంకలో లభించిన రెండో అతిపెద్ద ప్రాజెక్ట్.. మన్నార్ పవన విద్యుత్. ఇదివరకు ఆ కంపెనీకి కొలంబోలో వ్యూహాత్మక పోర్టు టెర్మినల్ నిర్మాణం దక్కింది. శ్రీలంక, భారత్, జపాన్ సంయుక్తంగా నిర్మించ తలపెట్టిన ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ అది. వెస్ట్ కంటైనర్ టెర్మినల్ ప్రాజెక్టు నిర్వహణలోకి అత్యధిక వాటా అదానీ సాధించుకుంది.