Pakistan Crisis: అంధకారంలోకి దాయాది పాక్.. వ్యాపారాలపై ఆంక్షలు.. పెళ్లిళ్లకు కూడా..!!
Pakistan Crisis: కొత్తం సంవత్సరం పాకిస్థాన్ కి కన్నీటిని తెచ్చింది. ఇప్పటికే పాక్ ఆర్థికం శ్రీలంక బాటలో నడుస్తోంది. ఏ క్షణంలోనేనా అప్పుల ఊబిలో కూరుకున్న దాయాది అంధకారంలోకి జారుకుంటుందని ఇప్పటికే ఆర్థిక వేత్తలు పలు మార్లు హెచ్చరించారు. ఇన్నాళ్లుగా పెనం మీద ఉన్న దాని పరిస్థితి ప్రస్తుతం పొయ్యిలో పడినట్లుగా మారిపోయింది.
వెంటాడుతున్న కొరత..
పాక్ వద్ద తగినంత ఇంధనం, బొగ్గు లేకపోవటంతో దాని పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఈ పరిస్థితిని చూస్తుంటే అచ్చం శ్రీలంక పతనం సమయంలో జరిగిన విషయాలు గుర్తుకువస్తున్నాయి. నిల్వలు అడుగంటడం వల్ల అక్కడ విద్యుత్ ఉత్పత్తి తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్లో కరెంటు కొరత పెరగటంతో పాక్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
ప్రభుత్వ ప్రకటన..
కరెంటు కష్టాలు తీవ్రరూపం దాల్చటంతో దాయాది ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇది కేవలం పాక్ ప్రజలను మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పాక్ దివాళా తీయటం కాయం అన్నట్లు వార్తలు కూడా పెద్దఎత్తువ వస్తున్నాయి. ధ్వీపదేశం పతనం కూడా ఇలాగే మెుదలైందని ఇప్పుడు చాలా మంది భావిస్తున్నారు.
దేశాన్ని కాపాడేందుకు..
దిగజారుతున్న తన ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు, తన విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు పాక్ రంగంలోకి దిగింది. డిసెంబర్ మాసంలోని లెక్కల ప్రకారం పాక్ వద్ద కేవలం నెల రోజులకు సరిపడా దిగుమతుల చెల్లింపుకు సరిపోయే విదేశీ మారకం మాత్రమే ఉంది. అందుకే కొన్ని నెలల నుంచి పొదుపు దారిలో దిగిన పాక్.. ఇండియా, చైనా నుంచి టీ దిగుమతిని తగ్గించింది. దీనికి బదులు లస్సీ వంటి ఇతర దేశీయ పానీయాలను త్రాగాలని ప్రజలను కోరింది. దాదాపు అలాంటి ప్రకటనే ఇప్పుడు వెలువడింది.
కొరతకు విరుడుగు..
దేశంలో కరెంటు కొరతను తీర్చేందుకు పాక్ ప్రభుత్వం విద్యుత్ వినియోగాన్ని నియంత్రించాలని సరికొత్త ప్రణాళికను రూపొందించింది. విద్యుత్ పొదుపు పథకం కింద పాకిస్థాన్లోని అన్ని మాల్స్, మార్కెట్లు, దుకాణాలను రాత్రి 8.30 గంటలకల్లా మూసేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. IMF ఫైనాన్సింగ్లో జాప్యం కారణంగా ప్రభుత్వం అదనపు సంక్షోభంలోకి జారుకుంది. ఇంధన దిగుమతులకు పోతున్న విలువైన మారకాన్ని కాపాడుకునేందుకు ఈ చర్యలు చేపట్టింది.
పెళ్లిళ్లకూ తిప్పలు..
కేవలం వ్యాపారాలకు మాత్రమే కాక కళ్యాణ మండపాలకు సైతం కరెంటు ఆంక్షలు వచ్చాయి. రాత్రి 10 గంటలకల్లా కళ్యాణ మండపాలను కూడా మూసేయాలని పాక్ నిర్ణయించింది. ఈ పొదుపు చర్యల ద్వారా సుమారు 62 బిలియన్ పాకిస్తానీ రూపాయలు ఆదా చేయవచ్చని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించటం అంతర్జాతీయంగా పాక్ ఆర్థికంపై ప్రశ్నలను రేకెత్తిస్తోంది.
తగ్గించాల్సిందే.. హ..
పాకిస్థాన్లోని అన్ని ప్రభుత్వ సంస్థలు, విభాగాలు తక్షణమే విద్యుత్ వినియోగాన్ని 30 శాతం తగ్గించాలని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా ఆదేశించారు. పైగా పాకిస్థాన్ లో ద్రవ్యోల్బణం 24.5 శాతానికి పెరిగిన తర్వాత తాజాగా ప్రజలపై విద్యుత్ పిడుగు పడటంతో ఆందోళనలో ఉన్నారు. ఇది పెరిగిన మాంద్యానికి సంకేతం అని కూడా మరికొందరు భావిస్తున్నారు. పాక్ ఈ విషమ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కుతుందో వేచి చూడాల్సిందే.