e-RUPI: నేడు ఈ-రుపీని ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్ట్ 2, సోమవారం నాడు ఈ-రూపీనీ (e-RUPI) సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభిస్తున్నారు. నగదురహిత ట్రాన్సాక్షన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త చెల్లింపు విధానాన్ని తీసుకు వస్తోంది. నేషనల్ పేమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) రూపొందించిన ఈ కొత్త ప్రక్రియ నేటి నుండి అందుబాటులోకి వస్తోంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కోసం ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, అమెజాన్ పే, పేటీఎం వంటి వ్యవస్థలు ఉన్నాయి.
ఇప్పుడు వీటితో అవసరం లేకుండా నగదురహిత ట్రాన్సాక్షన్స్ కోసం కేంద్రం కొత్త విధానాన్ని రూపొందించింది. అదే ఈ-రూపీ. ఈ క్రమంలో నగదు చెల్లింపుకు క్యూఆర్ కోడ్ లేదా ఎస్సెమ్మెస్ స్ట్రింగ్ ఓచర్ ద్వారా లబ్ధిదారుడి మొబైల్ ఫోన్కు అనుసంధానం ఉండగా, ఈ ఓచర్ లేదా క్యూఆర్ కోడ్ను లబ్ధిదారు తనకు అవసరమైనచోట వినియోగించుకోవచ్చు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్కు మరింత వేగం తెచ్చే ప్రక్రియలో భాగంగా ఈ-రూపీని రూపొందించారు.
నేటి నుండి అందుబాటులోకి రానున్న ఈ విధానం తొలిదశలో కేంద్రం నుండి ఆర్థిక సాయం పొందే లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ సాయం అందుతుంది. మొబైల్ ఫోన్కు క్యూఆర్ కోడ్, ఎస్సెమ్మెస్ ఓచర్ రూపంలో నగదు అందుతుంది.