గుజరాత్లో విమాన తయారీ ప్రాజెక్ట్.. శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ.. టాటాల సౌజన్యంతో..
Aircraft Unit: గుజరాత్లోని వడోదరలో C-295 రవాణా విమానాల తయారీ ప్లాంట్కు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. భారత వైమానిక దళం కోసం C-295 రవాణా విమానాన్ని టాటా-ఎయిర్బస్ తయారు చేస్తుంది. 40 విమానాలను తయారు చేయడమే కాకుండా, వడోదరలోని ఈ సదుపాయం వైమానిక దళ అవసరాలు, ఎగుమతుల కోసం అదనపు విమానాలను తయారు చేస్తుందని తెలుస్తోంది.
|
ప్రధాని మోదీ..
వడోదరలో తయారయ్యే రవాణా విమానాలు మన సైన్యానికి శక్తినివ్వటమే కాక, విమానాల తయారీలో కొత్త పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. త్వరలో 'మేక్ ఇన్ ఇండియా' ట్యాగ్తో ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్ అందుబాటులోకి వస్తాయని అన్నారు. రక్షణ రంగాన్ని 'ఆత్మనిర్భర్'గా మార్చేందుకు ఇవి దోహదపడతాయన్నారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడులో ఏర్పాటు చేయబడుతున్న డిఫెన్స్ కారిడార్లు మరింత శక్తినిస్తాయని తెలిపారు.
రాజ్ నాథ్ సింగ్..
దేశంలో తొలిసారిగా ప్రైవేట్ సెక్టార్ ఆధ్వర్యంలో ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారీపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. సి-295 రవాణా విమానం మొదటి భారత వైమానిక దళం స్క్వాడ్రన్ కూడా వడోదరలో ఉంటుందని IAF అధికారులు తెలిపారు. భారత్ చెబుతున్న మాటను చేతల రూపంలో చేసి చూపటాన్ని ప్రపంచం చూస్తోందని రాజ్ నాథ్ తెలిపారు. రానున్న రోజుల్లో ప్రపంచ రక్షణ రంగంలో భారత్ తప్పకుండా పోటీపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
|
సరఫరా ఎప్పటి నుంచి..
భారతదేశంలో నిర్మించిన విమానాలు 2026 నుంచి 2031 వరకు సరఫరా చేయబడతాయి. మొదటి 16 ఫ్లై-అవే ఎయిర్క్రాఫ్ట్లను సెప్టెంబర్ 2023- ఆగస్టు 2025 మధ్య IAFకి పంపిణీ చేయబడినట్లు అధికారులు వెల్లడించారు. 1960 నాటి అవ్రో-748 విమానాల స్థానంలో 56 C-295 విమానాలను కొనుగోలు చేయడానికి భారతదేశం ఎయిర్బస్ డిఫెన్స్ మరియు స్పేస్తో రూ.21,935 కోట్ల ఒప్పందాన్ని గత సంవత్సరం కుదుర్చుకుంది.
టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్..
ఒప్పందం ప్రకారం ఎయిర్బస్ నాలుగు సంవత్సరాల్లో స్పెయిన్లోని సెవిల్లేలోని చివరి అసెంబ్లీ లైన్ నుంచి 'ఫ్లై-అవే' స్థితిలో మొదటి 16 విమానాలను డెలివరీ చేస్తుంది. తరువాత 40 విమానాలను టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ (TASL) తయారు చేసి అసెంబుల్ చేస్తుంది. ఇవి 5-10 టన్నుల సామర్థ్యం కలిగిన రవాణా విమానాలు. గరిష్ఠంగా గంటకు 480 కిమీ వేగంతో ప్రయాణించగలవు. ప్రత్యేక మిషన్లతో పాటు విపత్తు ప్రతిస్పందన, సముద్ర గస్తీ విధులను నిర్వహించే సామర్ధ్యం వీటి సొంతం.
ఉపాధి అవకాశాలు..
ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా 600 అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు, 3,000 పైగా పరోక్ష ఉద్యోగాలు, అదనంగా 3,000 మధ్యస్థ నైపుణ్యం కలిగిన వారికి ఉపాధి అవకాశాలు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అందించనుంది. ఈ రంగంలో 42.5 లక్షల కంటే ఎక్కువ పని గంటల పనిని ఇవి కల్పిస్తాయని అంచనా. అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వల్లే ఈ ప్రాజెక్ట్ మరో రాష్ట్రానికి వెళ్లిందని శివసేన నాయకుడు ఆదిత్య థాకరే అక్టోబర్ 20న నిందించారు.