2000 నోటును తీవ్రంగా వ్యతిరేకించిన ప్రధాని.. తప్పనిసరి పరిస్థితుల్లో తలూపిన మోడీ
demonitization: కేంద్రంలోని మోడీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల్లో ప్రజలు మర్చిపోలేనిది నోట్ల రద్దు. డీమోనిటైజేషన్ వల్ల వారు పడిన బాధలు, ఇబ్బందులు వర్ణనాతీతం. ఆశయం మంచిదే కావచ్చు కానీ ఆచరణలో మాత్రం 100 శాతం విజయవంతం కాలేకపోయారు అన్నది దేశ ప్రజానీకం భావన. అయితే అప్పుడు ఓ నిర్ణయాన్ని ప్రధాని తీవ్రంగా వ్యతిరేకించారట కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చిందట.
రెండు వేల నోట్లు చెలామణిలోకి రావడానికి ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా లేరని మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా తెలిపారు. చిన్న కరెన్సీ నోట్లను ముద్రించే సామర్థ్యం లేదని చెప్పటంతో అయిష్టంగానే దానికి అంగీకరించినట్లు చెప్పారు. నోట్ల రద్దును పరిమిత కాలంలోనే పూర్తి చేయాలి కాబట్టి తమ ముందు మరో మార్గం లేదని వెల్లడించారు.
పేదల కోసం 2000 నోటును తీసుకొచ్చినట్లు మోడీ ఎప్పుడూ భావించలేదని ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిశ్రా గతాన్ని గుర్తుచేసుకున్నారు. లావాదేవీల కంటే కూడా బ్లాక్ మనీ తరహాలో నిల్వ ఉంచడానికే ఎక్కువగా ఉపయోగ పడుతుందని ముందే తెలుసని పేర్కొన్నారు. కేవలం ఆర్థిక వ్యవస్థ కరెన్సీ అవసరాన్ని తీర్చడానికి మాత్రమే ప్రాథమికంగా దాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.
2016 నవంబర్లో జరిగిన పెద్దనోట్ల రద్దు ప్రక్రియలో భాగంగా చెలామణిలో ఉన్న 500 మరియు 1000 కరెన్సీ నోట్లను నిర్దిష్ట వ్యవధిలో కొత్త నోట్లతో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు మిశ్రా చెప్పారు. నల్లధనాన్ని అరికట్టడమే లక్ష్యంగా మోడీ భావిస్తున్నారని, పెద్ద నోటు వల్ల అసలు టార్గెట్ దెబ్బతింటుందని అన్నట్లు వెల్లడించారు. అప్పటికీ 2000 నోటును తర్వాత నిలిపివేయాలన్న ఆలోచన ప్రధాని మనసులో లేదని స్పష్టం చేశారు. అని మిశ్రా అన్నారు.