ఎస్బీఐ కార్డ్స్ ఐపీవో: షేర్లు వద్దు బాబోయ్... డబ్బులివ్వండి!
ఎస్బీఐ కార్డ్స్ ఐపీవో... స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక సంచలనం. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ సంస్థ ఐన ఈ కంపెనీ ఐపీవో కు జనం బ్రహ్మరథం పట్టారు. ప్రైవేటు పెట్టుబడిదారులతో పాటు రిటైల్ ఇన్వెస్టర్లు, క్యూఐపీ ఇన్వెస్టర్లు అందరూ ఎంతో ఉత్సాహంతో బిడ్స్ దాఖలు చేశారు. ఎస్బీఐ కార్డ్స్ సుమారు రూ 10,000 కోట్లు సమీకరించాలని భావిస్తే... ఇన్వెస్టర్లు ఏకంగా రూ 2,00,000 కోట్ల స్థాయిలో బిడ్లు సమర్పించి ఎస్బీఐ కార్డ్స్ పై తమకున్న విశ్వాసాన్ని చాటుకున్నారు. అలాగే దాని భవిష్యత్తు బంగారమేనని, దాంతో తాము పెట్టే పెట్టుబడి అతి తక్కువ సమయంలో రెట్టింపు కావటం ఖాయం అని భావించారు. కానీ, కొన్ని రోజుల్లోనే పరిస్థితులు తారుమారు అయ్యాయి. స్టాక్ మార్కెట్లలో కరోనా వైరస్ కల్లోలం సృష్టించింది. వారం రోజుల్లో రూ లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేసింది. ఈ దెబ్బకు పెద్ద పెద్ద కంపెనీల షేర్లు కూడా ఎన్నడూ లేనంత పతనం అయ్యాయి. ఈ నేపథ్యంలో వచ్చే వారంలో ఉన్న ఎస్బీఐ ఐపీవో లిస్టింగ్ అంత ఘనంగా జరిగే అవకాశాలు లేవని అనలిస్టులు భావిస్తున్నారు.
SBI Card IPO: మార్కెట్లపై కరోనా ఉప్పెన, ఎస్బీఐ కార్డ్స్ లిస్టింగ్పై టెన్షన్
షేర్లు వద్దు... డబ్బులు ముద్దు...
కరోనా వైరస్ ప్రభావంతో జనవరి నుంచి ఇప్పటి వరకు బిఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 8,000 పాయింట్లను కోల్పోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 10,000 పాయింట్ల స్థాయిని తాకింది. ఇంత భారీ పతనం జరగటంతో ఇప్పుడు బ్లూ చిప్ కంపెనీల షేర్లు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. అందుకే, ఎస్బీఐ కార్డ్స్ ఐపీవో కోసం సమర్పించిన తమ డబ్బులు వీలైనంత త్వరగా తిరిగి వస్తే బాగుండు అని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అసలు ఆ షేర్లు అలాట్ కాకపోయినా నష్టం లేదు కానీ, ఆ డబ్బులతో ఇతర కంపెనీల షేర్లు కొనుగోలు చేసేందుకు అవకాశం లభిస్తుందని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 2008 లో కూడా ఇలాగే స్టాక్ మార్కెట్లు పతనం అయినప్పుడు ఇన్వెస్ట్ చేసిన వారికి 350 శాతం నుంచి 1 లక్ష శాతం రిటర్న్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకే, వారు ఇలా థింక్ చేస్తున్నారని అనలిస్టులు పేర్కొంటున్నారు.
గ్రే మార్కెట్లో తగ్గిన క్రేజ్...
ఎస్బీఐ కార్డ్స్ ఐపీవో కు తొలుత మార్కెట్లో విపరీతమైన క్రేజ్ లభించింది. అందుకే ఈ ఐపీవో ఏకంగా 26 రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ ఐంది. అప్పుడు గ్రే మార్కెట్లో ఎస్బీఐ షేర్లకు రూ 350 వరకు ప్రీమియం కోట్ చేశారు. అందుకే మిగితా ఇన్వెస్టర్లు కూడా ఈ కంపెనీ షేర్లు రూ 1,000 పైనే లిస్ట్ అవుతాయని భావించారు. రూ 750-755 ప్రైస్ బ్యాండ్ తో వచ్చిన ఎస్బీఐ కార్డ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఒక్క రోజులోనే కనీసం 30% రాబడి లభిస్తుందని ఆశించారు. కానీ, ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఈ షేర్లకు క్రేజ్ తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో, ఎస్బీఐ కార్డ్స్ ఐపీవో లిస్టింగ్ మహా అంటే రూ 800-850 రేంజ్ కు మించి ఉండే అవకాశం లేదని అంటున్నారు. అందుకే, ఇన్వెస్టర్లు ప్రస్తుతం మనసు మార్చుకున్నారని, వీలైనంత త్వరగా తమ డబ్బులు తమకు తిరిగి వస్తే బాగుండు అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు సమాచారం.
అందుబాటులోకి రూ 1.9 లక్షల కోట్లు...
ఎస్బీఐ కార్డ్స్ ఐపీవో ద్వారా ఇన్వెస్టర్లకు షేర్లు కేటాయిస్తే... వారి చేతికి సుమారు రూ 1.9 లక్షల కోట్లు తిరిగి రానున్నాయి. ఎందుకంటే... ప్రస్తుత ఐపీవో ద్వారా ఎస్బీఐ కార్డ్స్ కేవలం రూ 10,000 కోట్లు మాత్రమే సమీకరిస్తోంది. కానీ, ఇన్వెస్టర్ల నుంచి ఈ కంపెనీ షేర్ల కేటాయింపు కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎలాగైనా అధిక మొత్తం షేర్ల ను దక్కించుకోవాలని ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో బిడ్స్ దాఖలు చేశారు. దీంతో మొత్తంగా సుమారు రూ 2,00,000 కోట్ల నగదు ఇన్వెస్టర్ల చేతి నుంచి ఏఎస్బీఏ ఖాతాల్లోకి వెళ్ళిపోయింది. ఈ నగదు మళ్ళీ తిరిగి ఇన్వెస్టర్లకు రావాలంటే షేర్లు కేటాయించాల్సి ఉంటుంది. వచ్చే వారం ఐపీవో లిస్టింగ్ అనుకుంటున్నారు కాబట్టి, రూ 10,000 కోట్లు పోను, రూ 1.9 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల నగదు వారి వారి ఖాతాలకు తిరిగి జమ చేస్తారు. అప్పుడు ఇన్వెస్టర్లు ఆ నగదుతో వారికి నచ్చిన ఇతర కంపెనీల షేర్లను కూడా కొనుగోలు చేసే అవకాశం ఏర్పడుతుంది.