వేతనం పెరిగిందా, అయితే పన్ను ఆదా పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి
కరోనా సమయంలో కొంతమంది ఉద్యోగం కోల్పోతే, మరికొంతమంది వేతన కోత ఎదుర్కొన్నారు. కొన్ని కంపెనీలైతే వేతన పెంపును నిలిపివేశాయి. దీంతో ఉద్యోగులు వేతనంలో పెరుగుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ద్రవ్యోల్భణం గరిష్టస్థాయికి చేరుకోవడంతో ఈ సంవత్సరం వేతన పెంపు అవసరం. కానీ వేతన పెంపుతో పన్ను కూడా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వేతన పెంపు అనంతరం పన్ను ఆదా కోసం పెట్టుబడి ప్రణాళికలు అవసరం.
పెట్టుబడులకు ప్రాధాన్యం
ప్రతి సంవత్సరం వేతన పెరుగుదల కోసం ఉద్యోగులు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తారు. పెరిగిన వేతన మొత్తాన్ని విలాసాల కోసం ఖర్చు చేయకుండా పెట్టుబడుల పోర్ట్పోలియోను విస్తరించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. స్వల్ప, దీర్ఘకాల లక్ష్యాల కోసం సంపదను నిర్మించాలని చూస్తున్న వారికి, పెరిగిన వేతనాన్ని మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్, పీపీఎఫ్ లేదా ఎన్పీఎస్ వంటి సాధనాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల అనుకున్న సమయం కంటే ముందే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ వేతన పెంపు ఉపయోగపడుతుంది.
పెట్టుబడులు
కరోనా సమయంలో వేతనం తక్కువ ఉండటం, అదనపు ఖర్చులతో రుణాలు తీసుకున్నవారు వాటిని తిరిగి చెల్లించవచ్చు. ఇవి కాకుండా విద్య, గృహ, వ్యక్తిగత రుణాలకు సంబంధించి ఈఎంఐలు చెల్లిస్తున్నవారు ఈ మొత్తాన్ని రుణ చెల్లింపుల కోసం వినియోగించవచ్చు. వేతన పెరుగుదలతో వ్యక్తిగత పన్ను పెరగవచ్చు. అంటే ఇప్పటి వరకు 20 శాతం స్లాబ్లో ఉంటే 30 శాతానికి వెళ్లవచ్చు. అప్పుడు పెట్టుబడులపై దృష్టి సారించాలి. అదే సమయంలో మీ పోర్ట్ పోలియోలో పన్ను పరిధిలోకి వచ్చే పెట్టుబడులు 30 శాతానికి మించకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
పెట్టుబడి మార్గం
మీ వేతనం పెరిగిన తర్వాత ఆ పెరుగుదలను బట్టి మీ పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవాలి. అయితే సెక్షన్ 80సీ కింద రూ.1,50,000, సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద రూ.50,000, సెక్షన్ 80డీ కింద రూ.25000 మొత్తం రూ.2,25,000 అవుతుంది. వివిధ పెట్టుబడుల ద్వారా రూ.60,000 వరకు ఆదా చేసుకోవచ్చు. మీరు హోమ్ లోన్ తీసుకుంటే వడ్డీ చెల్లింపుల ద్వారా సెక్షన్ 24బీ కింద మరో రూ.2 లక్షల మినహాయింపును పొందవచ్చు.