బ్యాంకు ఉద్యోగులకు షాక్: శాలరీకి పెర్ఫార్మన్స్ లింక్!
ప్రభుత్వ ఉద్యోగం అంటేనే జీవితాంతం సెక్యూరిటీ అనే భావన ఉంటుంది. అందునా బ్యాంకు ఉద్యోగం అంటే ఇంకా క్రేజ్. టైం టు టైం జాబ్. వారాంతంపు సెలవులు. తక్కువ పని... ఎక్కువ వేతనం అనేది సర్వ సాధారణ అభిప్రాయం. అయితే, ఇప్పుడు వారికి కొత్త చిక్కు వచ్చి పడబోతోంది. ప్రభుత్వం వాటికి భారీ షాక్ ఇవ్వబోతోంది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు ఇకపై వారి పనితీరు ఆధారంగానే వేతనాలు, ఇన్సెంటివ్స్ చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పని చేసే లక్షలాది ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ఈ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. పనితీరు ఆధారంగా వేరియబుల్ పే అనే విధానం ప్రైవేట్ రంగంలో సర్వ సాధారణం. ఇది దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంకుల్లోనూ అమలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు దీనిని అమలు చేయబోవడం మాత్రం ఇదే తొలిసారి కానుంది.
మారిన ఆధార్ కార్డు రూల్: బ్యాంకు అకౌంట్ ఓపెనింగ్ చాలా ఈజీ
ఐబిఏ ప్రతిపాదన...
పెర్ఫార్మన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ (పీఎల్ఐ) గా పేర్కొనే కొత్త విధాన ప్రతిపాదనను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఏ) ముందుకు తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనకు ప్రముఖ బ్యాంకు యూనియన్ లు అన్ని కూడా సూత్రప్రాయంగా తమ అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో పని తీరు ఆధారిత బోనస్, ఇతర ఇన్సెంటివ్స్ చెల్లింపు విధానం అమలు చేయటం కేవలం లాంఛనం మాత్రమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ కమిటీకి బ్యాంకుల తరఫున యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎండీ రాజకిరణ్ రాయి సారథ్యం వహిస్తున్నారు. 11 వ వేతన సవరణ పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇది అమల్లోకి వస్తే 2017 నవంబర్ 1 నుంచి ఉద్యోగులకు సవరించిన వేతనాలను చెల్లించాల్సి ఉంటుంది.
పెరిగే వేతనానికి మాత్రమే...
ప్రస్తుతం 11 వ వేతన సవరణ పై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త వేతన చెల్లింపుల ప్రతిపాదన దేనికి వర్తిస్తుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, దీనిపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వివరణ ఇచ్చిందని ఆల్ ఇండియా బ్యాంకు ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబిఓసి) జనరల్ సెక్రటరీ సౌమ్య దత్త తెలిపారు. కొత్త విధానం పాత వేతనాలకు వర్తించదని... అది కేవలం వేతనంపై అదనంగా పెరుగుతున్న దానికి మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది.
8 లక్షల మందిపై ప్రభావం...
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అమలు చేయబోతున్న కొత్త ప్రతిపాదనతో లక్షల్లో ఉద్యోగులపై ప్రభావం పడబోతోంది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కలిపి ప్రస్తుతం సుమారు 8 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరికీ కొత్త విధానం వర్తిస్తుంది. ఈ ప్రతిపాదనలను అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒకే విధంగా అమలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రతిపాదనల్లో మరో ట్విస్ట్ కూడా ఉంది. అదేమిటంటే ... ప్రతిపాదిత పీఎల్ఐ ఒక వ్యక్తిగత ఉద్యోగి పనితీరు ఆధారంగా కాకుండా... మొత్తం బ్యాంకు పనితీరు ఆధారంగా ఎంత ఇన్సెంటివ్ చెల్లించాలనేది నిర్ణయిస్తారట. అంటే బ్యాంకు లాభాల్లో ఉంటె ఒక రకమైన ఇన్సెంటివ్, నష్టాలు చవిచూస్తే నిల్ ఇన్సెంటివ్ ఉంటుందేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై త్వరలో పూర్తి స్థాయిలో స్పష్టత లభించనుందని ఆశిస్తున్నారు.