రీఛార్జీ పైన డబ్బులు వసూలు చేస్తున్న ఫోన్పే, ఎంత వసూలు అంటే
వాల్మార్ట్ గ్రూప్కు చెందిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ సంస్థ ఫోన్పే, ఫోన్ రీఛార్జీలపై ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయడం ప్రారంభించింది. రూ.50 కంటే అధిక వ్యాల్యూ కలిగిన మొబైల్ రీఛార్జీలపై ట్రాన్సాక్షన్స్కు రూ.1 నుండి రూ.2 చొప్పున వసూలు చేయనుంది. రీఛార్జీ ట్రాన్సాక్షన్ UPI ద్వారా చేసినా, ప్రాసెసింగ్ ఛార్జీ భారం పడుతుంది. UPI ఆధారిత ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీలు విధించడం ప్రారంభించిన మొదటి డిజిటల్ పేమెంట్స్ యాప్గా ఫోన్పే నిలిచింది. పోటీ సంస్థలు ఈ ట్రాన్సాక్షన్స్ పైన ఛార్జీ వసూలు చేయడం లేదు. ఇప్పటి వరకు క్రెడిట్ కార్డ్స్ ద్వారా చేసే చెల్లింపులపై ఫోన్పేతో పాటు ఇతర సంస్థలు ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేస్తున్నాయి.
రూ.50 లోపు ఫోన్ రీఛార్జీ పైన ఛార్జీ ఉండవని తెలిపింది. రూ.50-రూ.100 రీఛార్జీలపై రూ.1, రూ.100 దాటితే రూ.2ను ప్రయోగాత్మకంగా వసూలు చేయనున్నట్లు ఫోన్పే తెలిపింది. థర్డ్ పార్టీ యాప్స్లో అధిక ట్రాన్సాక్షన్స్ను ఫోన్పే నిర్వహిస్తోంది. సెప్టెంబర్లో 165 కోట్ల UPI ట్రాన్సాక్షన్స్ను ఫోన్పే నిర్వహించి, ఈ విభాగంలో 40 శాతం వాటాను కలిగి ఉంది. రీఛార్జీకి సంబంధించి తాము చిన్నస్థాయి ప్రయోగాన్ని అమలు చేస్తున్నామని, ఇక్కడ కొంతమంది కస్టమర్లు మొబైల్ రీఛార్జీ కోసం చెల్లిస్తున్నారని తెలిపారు.
ఫోన్పే సహా పలు మొబైల్ పేమెంట్ యాప్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన చెల్లింపులకు ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేస్తోంది. అయితే ఫోన్పే పైన మనీ ట్రాన్సాక్షన్, ఇతర ట్రాన్సాక్షన్స్ ఉచితంగా కొనసాగుతాయని తెలిపింది. 'ఛార్జీని వసూలు చేస్తున్న పేమెంట్ ప్లాట్ ఫామ్స్లో తమది ఒక్కటే లేదు. బిల్ పేమెంట్స్ పైన చిన్న మొత్తం వసూలు చేస్తున్నాం' అని ఫోన్ పే అధికార ప్రతినిధి తెలిపారు.