కరోనా సెకండ్ వేవ్: బ్యాంకు డిపాజిట్ పరిమితి పెంచాలి, మరో ఉద్దీపన కావాలి
కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న నేపథ్యంలో మరో ఉద్దీపన ప్యాకేజీ కావాలని కోరుతున్నాయి పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు. ఇప్పటికే ఏడాది కాలంగా కరోనా వల్ల భారత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. సెకండ్ వేవ్ అంతకంటే తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదేందుకు మళ్లీ ప్యాకేజీ కావాలంటోంది. కరోనా సెకండ్ వేవ్తో ఆర్థిక వ్యవస్థ మళ్లీ ఇబ్బందుల్లో కూరుకుపోయిందని పారిశ్రామిక రంగ సమాఖ్య PHDCCI అంటోంది.
ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్యాకేజీ తప్పనిసరి అని అంటోంది. ప్యాకేజీ భారీగా ఉండాలని కోరుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు మొత్తం 17 సూచనలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాసింది PHDCCI. పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలు దెబ్బతీసే చర్యలు తీసుకోవద్దని కోరింది. తద్వారా జాతీయ స్థాయిలో లాక్డౌన్ వంటివి వద్దని అభిప్రాయపడింది. అలాంటి చర్యలు ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పు అని హెచ్చరించింది.
MSMEలను మరింతగా ఆదుకోవాలని, అత్యవసర రుణ పరపతి హామీ పథకాన్ని(ECGLS) వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించాలని, ఈ పథకం కేటాయింపులను ప్రస్తుత రూ.3 లక్షల కోట్ల నుండి రూ.6 లక్షలకు పెంచాలని కోరింది. కరోనా అదుపులోకి వచ్చే వరకు ఐటీ షోకాజ్ నోటీసులు వద్దని, 2021-22 ఆర్థిక సంవత్సరానికి TDS రేటును 50% తగ్గించాలని, అలాగే చైనా స్టీల్ ఎగుమతులపై నిషేధం విధించాలని సూచించింది. స్టీల్ ఎగుమతులపై 35 శాతం సుంకం విధించాలని, అన్ని రకాల ఇనుప ఖనిజం ఎగుమతులపై ఒకే సుంకం ఉండాలని పేర్కొంది. ఆయుష్ పరిశ్రమ ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించాలని కోరింది. బ్యాంకుల్లో నగదు రహిత డిపాజిట్ పరిమితిని రూ.2 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచాలని కోరింది. టీకాల ఉత్పత్తిని స్వచ్చంధ లైసెన్స్ పద్ధతిలో చేపట్టేందుకు అనుమతించాలని పేర్కొంది.