అందుకే నిర్మలమ్మ అడుగు: షాకింగ్... పీఎఫ్ అకౌంట్ వారికి బంగారు గుడ్డు పెట్టే బాతు
రిటైర్మెంట్ ఫండ్ కార్పస్లో 1.23 లక్షల హైనెట్-వర్త్ ఇండివిడ్యువల్స్ (HNIs) ప్రావిడెంట్ ఫండ్ రూ.62,500 కోట్లు పేరుకుపోయింది. ఇందులో అత్యధికంగా ఒకరికి చెందిన రూ.103 కోట్లు ఉన్నాయి. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ఈపీఎప్ పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల వరకే ప్రకటించారు. అంతకుమించితే మినహాయింపు లేదు. ఈ నేపథ్యంలో అధిక వేతనం/అధిక ఈపీఎఫ్ ఖాతాలు చర్చనీయాంశంగా మారాయి.
బడ్జెట్లో పన్ను, ఐటీ రిటర్న్స్ మినహాయింపులు.. షరతులు వర్తిస్తాయి
వారికి కూడా వడ్డీ భారం
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాలో 4.5 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇందులో 1.23 లక్షల మంది HNIs. ఈపీఎఫ్ అకౌంట్కు భారీ మొత్తంలో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. వారి మొత్తం కాంట్రిబ్యూషన్ రూ.62,500 కోట్లుగా ఉంది. ఈ అధిక వేతనం లేదా అధిక ఈఫీఎఫ్ సబ్స్క్రైబర్లకు కూడా కేంద్ర ప్రభుత్వం 8 శాతం వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. అధిక ఆదాయం కలిగిన వారికి కూడా చెల్లించడం ప్రభుత్వానికి భారమైనదే.
వారి ఖాతాల్లోనే వందల కోట్లు
ఈపీఎఫ్ అకౌంట్కు అత్యధికంగా కాంట్రిబ్యూట్ చేస్తోన్న ఒకరి ఖాతాలో రూ.103 కోట్లకు పైగా ఉన్నాయి. రెండో అత్యధిక కాంట్రిబ్యూటర్ అకౌంట్లో రూ.86 కోట్లు ఉన్నాయి. టాప్ 20 HNIs అకౌంట్లలో రూ.825 కోట్లు జమ అయ్యాయి. అదే సమయంలో టాప్ 100 HNIs అకౌంట్లలో రూ.2,000 కోట్లు ఉన్నాయి. ఈపీఎఫ్కు కాంట్రిబ్యూట్ చేసే వారి మధ్య అసమానతలు తొలగించేందుకు, అధిక మొత్తంలో డబ్బు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు తాజాగా బడ్జెట్లో తీసుకు వచ్చిన నిబంధన ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
బంగారు గుడ్లు పెట్టే బాతుగా..
HNI పీఎఫ్ కాంట్రిబ్యూటర్స్ ఈపీఎఫ్ఓలో 0.27 శాతం మాత్రమే ఉన్నారు. సగటున ఒక్కొక్కరి అకౌంట్లో రూ.5.92 కోట్లు ఉన్నాయి. అంతేకాదు, వీరు ప్రతి ఏడాది పన్నురహిత వడ్డీ హామీగా రూ.50.3 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని ఆర్జిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.2.5 లక్షలు, అంతకుమించి ప్రావిడెంట్ కాంట్రిబ్యూషన్ పైన పన్ను మినహాయింపును తొలగించడం గమనార్హం. అంటే సంపన్నులకు ఈపీఫ్ కేవలం గూడు లేదా అండగా ఉండే అంశంగా లేదు. బంగారు గుడ్లు పెట్టే బాతుగా వారికి ఉంది.