PF rule change: ఆధార్తో లింక్ చేయకుంటే వచ్చే నెల నుండి డబ్బులు పడవ్
ప్రావిడెంట్ ఫండ్(PF)సబ్స్క్రైబర్లు UAN నెంబర్తో తమ ఆధార్ నెంబర్ను జత చేయడాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ తప్పనిసరి చేసింది. ఆగస్ట్ 31వ తేదీని ఇందుకు గడువుగా విధించింది. ఈ లోగా ఆధార్ కార్డును జత చేయకపోతే సెప్టెంబర్ 1వ తేదీ నుండి పీఎఫ్కు సంబంధించిన ఎలాంటి సేవలు పొందలేరు. కంపెనీలు పీఎఫ్ మొత్తాన్ని జమచేయలేకపోవడంతో పాటు పీఎఫ్కు సంబంధించి సబ్స్క్రైబర్లు కూడా నగదును ఉపసంహరించుకోలేరు. ఈ మేరకు సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మే 3వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. మొదట ఈపీఎఫ్ ఖాతాకు ఆధార్ను లింక్ చేయడానికి జూన్ 1వ తేదీని గడువుగా విధించింది. తాజాగా సెప్టెంబర్ 1వ తేదీ వరకు పొడిగించింది. ఇదివరకే ఆధార్-పీఎఫ్ ఖాతాను లింక్ చేస్తే ధృవీకరించుకోవాలి.
లింకింగ్ తప్పనిసరి
సెప్టెంబర్ 1వ తేదీ నుండి యూఏఎన్తో ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి అని, లింక్ చేయని కేసులకు కంపెనీలు పీఎఫ్ను చెల్లించలేరని డెలాయిట్ ఇండియా భాగస్వామి కస్తూరి రంగన్ అన్నారు. ఈపీఎఫ్ఓ నోటీసు జారీ చేసిందని, తద్వారా ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఖాతాను వారి ఆధార్ నెంబర్తో లింక్ చేసేలా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు యజమాని పైన ఉందని ఎల్ అండ్ ఎల్ పార్ట్నర్స్ భాగస్వామి అమృతి టోంక్ అన్నారు.
సెప్టెంబర్ 1వ తేదీ నాటికి ఆధార్ లింకింగ్ పూర్తి చేయాలని రిటైర్మెంట్ బాడీ ఈపీఎఫ్ఓ తెలిపింది. వచ్చే నెల నాటికి ఈ నిబంధన అమలు చేయడానికి యజమానులు సిద్ధం కావాలని సూచించింది. యజమానులు సిద్ధంగా ఉన్నట్లు నిర్ధారించుకోవాలని ఫీల్డ్ ఆఫీసర్లను కోరింది.
ఇలా లింక్ చేయండి
- తొలుత ఈపీఎఫ్వో మెంబర్ పోర్టల్కు వెళ్లాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్తో లాగ్-ఇన్ కావాలి.
- మెనూ బార్లోని మేనేజ్ ఆప్షన్కు వెళ్లాలి.
- అక్కడి డ్రాప్డౌన్ మెనూలో KYC ఆప్షన్ను ఎంచుకోవాలి.
- మీకు అక్కడ పలు రకాల ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఈపీఎఫ్తో ఆధార్ అనుసంధానం ఆప్షన్ ఎంచుకోవాలి.
- ఆధార్ కార్డుపై ఉన్న విధంగా మీరు పేరు, ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి.
- ఒకసారి సేవ్ చేశాక యూఐడీఏఐ డేటాతో మీ ఆధార్ వివరాలను ఈపీఎఫ్వో సరిపోల్చుతుంది.
- లింకింగ్ పూర్తయ్యాక ఆధార్ వివరాలు చెకింగ్ పూర్తయినట్లు మీకు వెరిఫైడ్ టిక్ మార్క్ వస్తుంది.
కోవిడ్ అడ్వాన్స్
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు అడ్వాన్స్ తీసుకోవడానికి వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ సమయంలో 5 కోట్ల మందికి పైగా సబ్స్క్రైబర్లకు కోవిడ్ అడ్వాన్స్ తీసుకునే సౌకర్యం ఇచ్చింది. అయితే ఉపసంహరణకు పరిమితి ఉంది. ఉద్యోగి మూడు నెలల కనీస వేతనం(బేసిక్ పే డియర్నెస్ అలవెన్స్) లేదా అమౌంట్ మొత్తంలోని 75 శాతం.. ఇందులో ఏది తక్కువ అయితే దానిని తీసుకోవచ్చు. కరోనా సమయంలో కోవిడ్ అడ్వాన్స్ ఎంతోమందికి ఉపయోగపడింది. అయితే ఆధార్-యూఏఎన్ లింక్ చేయకుంటే ఈఫీఎఫ్ ఇతర ప్రయోజనాలు పొందలేరు. అంటే కోవిడ్ అడ్వాన్స్, ఇన్సురెన్స్ బెనిఫిట్స్ వంటివి రాకుండా పోతాయి.