FASTag తర్వాత ఇక Fastlane: పెట్రోల్ బంకుల్లో నిరీక్షణకు చెక్
పెట్రోల్ బంకుల్లోను ఫాస్టాగ్ (FASTag) తరహా విధానం అమలులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అత్యవసర సమయంలో పెట్రోల్ బంకుకు వెళ్లి పెట్రోల్ కొట్టించేందుకు వరుస ఉంటుంది. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత బిల్లు కట్టేందుకు కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కూడా ఫాస్టాగ్ తరహా టెక్నాలజీ అమలులోకి వస్తే ఇంధనం నింపుకున్న అనంతరం బిల్లు కట్టేందుకు ప్రత్యేకంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉండదు.
ఫాస్టాగ్ తరహా ఫాస్ట్లేన్
టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించే లక్ష్యంతో మోడీ ప్రభుత్వం FASTagను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇదే తరహా టెక్నాలజీని పెట్రోల్ బంకుల్లోని ఫాస్ట్లేన్ (Fastlane) పేరుతో తీసుకు వచ్చేందుకు విధానాన్ని రూపొందించారు.
ప్రయోగాత్మకంగా అమలు
ముంబైకి చెందిన స్టార్టప్ ఏజీఎస్ ట్రాన్స్సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇప్పటికే HPCLకు చెందిన ముంబై, నావీ ముంబై, పుణే, థానేలలోని పెట్రోల్ పంపుల్లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.
ఇలా పని చేస్తుంది
ఈ టెక్నాలజీని వినియోగించుకునే వారు Fastlane అనే మొబైల్ యాప్ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఫాస్టాగ్ తరహాలోనే రేడియో ప్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) రీడర్ స్టిక్కర్ను కారు ముందు భాగంలో అతికించాలు. ఏ ఇంధనం ఎంత కావాలో బంకుకు చేరుకోవడానికి ముందే యాప్ ద్వారా ఫీడ్ చేసి పెట్టాలి. బంకులోకి వెళ్లగానే అక్కడ ఉంటే ప్రత్యేక వ్యవస్థ RFIDని రీడ్ చేసి ఫాస్ట్లేన్లో ఫీడ్ చేసిన సమాచారాన్ని పెట్రోల్ బంకు అటెండెంట్కు చేరవేస్తుంది. వారు అందుకు అనుగుణంగా ఇంధనం నింపుతారు. బిల్లు కట్టేందుకు ప్రత్యేకంగా వేచి చూడాల్సిన అవసరం లేదు. ఇంధనం నింపగానే వెళ్లిపోవచ్చు. యాప్కు అనుసంధానించిన బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపు పూర్తవుతుంది. ఆ తర్వాత మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది.
120 బంకుల్లో..
ప్రస్తుతం ముంబై, నేవీ ముంబై, థానే, పుణేల్లోని 120 HPCL పెట్రోల్ పంపుల్లో Fastlaneను ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు. ఇక్కడ పని తీరు అనంతరం దేశంలోని ప్రధాన నగరాలలో దీనిని అమలు చేయాలని భావిస్తున్నామని, మార్చి 2020 నాటికి దేశంలోని 10 ముఖ్య నగరాల్లోని పెట్రోల్ పంపుల్లో దీనిని తీసుకు వస్తామని పెట్రోలియం అండ్ డిజిటల్ పేమెంట్ బిజినెస్ సంస్థ ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ హెడ్ సతీష్ అన్నారు. ముంబైలోని HPCL బంకుల్లోని 2 శాతం Fastlane ద్వారా కొనసాగుతోందని చెప్పారు.