పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 4వ రోజు జంప్: వివిధ నగరాల్లో రేట్లు ఇలా
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజు పెరిగాయి. మంగళవారం నుండి ధరలు పెరుగుతున్నాయి. దీంతో పలు మెట్రో నగరాల్లో ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. లీటర్ పెట్రోల్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.88 మార్కును దాటింది. డీజిల్ రికార్డ్ గరిష్టానికి చేరుకుంది. నేడు పెట్రోల్ ధరలు వివిధ నగరాల్లో 26 పైసల నుండి 29 పైసల మధ్య, డీజిల్ ధరలు 34 పైసల నుండి 38 పైసల మధ్య పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతుండటంతో ఈ ప్రభావం దేశీయ ఇంధన ధరలపై పడుతోంది.
12 రోజుల్లో ఎంత పెరిగిందంటే
ఫిబ్రవరి నెలలో ఈ 12 రోజుల కాలంలో లీటర్ పెట్రోల్ పైన రూ.4.13, లీటర్ డీజిల్ పైన రూ.4.26 పెరిగింది. గత 11 నెలల కాలంలో రిటైల్ ధరలు తగ్గలేదు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలను బట్టి రోజువారీగా ధరల్లో హెచ్చుతగ్గులను చమురు మార్కెటింగ్ రంగ కంపెనీలు అమలు చేస్తాయి. గత కొంతకాలంగా వారానికి రెండుమూడు రోజులు ధరలు పెరుగుతున్నాయి. మిగతా రోజుల్లో ధరలలో మార్పు ఉండటంలేదు. వరుస చమురు ధరల పెరుగుదలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వరుసగా నాలుగు రోజులు ధరలు పెరిగాయి.
వివిధ నగరాల్లో ధరలు
వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్కు రూ.88.14, డీజిల్ రూ.78.38, ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.94.64, డీజిల్ రూ.85.32, చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.90.44, డీజిల్ రూ.85.32, బెంగళూరులో పెట్రోల్ రూ.91.09, డీజిల్ రూ.83.09, కోల్ కతాలో పెట్రోల్ రూ 89.44, డీజిల్ ధర రూ .81.96గా ఉంది. ఇక, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్లో పెట్రోల్ రూ.91.65, డీజిల్ రూ.85.50, అమరావతిలో పెట్రోల్ రూ.94.28, డీజిల్ రూ.87.62గా ఉంది.
ధరల సమీక్ష
2021 సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ ధరలు జనవరి 6, 2021 నుండి పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా నుండి క్రమంగా కోలుకోవడం, ఒపెక్ దేశాలు ఉత్పత్తిని తగ్గించడం వంటి వివిధ కారణాలతో ఇంధన డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఇంధన ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. చమురు రంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సమీక్షిస్తాయి.