GST పరిధిలోకి వస్తే పెట్రోల్ రూ.75, డీజిల్ రూ.68! కానీ నేతలు సిద్ధంగా లేరు
పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అయితే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సుముఖంగా లేవు. దీంతో చమురు ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడం ఇబ్బందికరంగా మారింది. పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే ధరలు భారీగా తగ్గుతాయనే వాదనలు ఉన్నాయి. ఈ వాదనను తాజాగా ఎస్బీఐ ఆర్థికవేత్తలు సమర్థిస్తున్నారు!
లీటర్ పెట్రోల్ రూ.75
చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.75కు దిగి వస్తుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంటున్నారు. కానీ ఇందుకు రాజకీయ నేతలు సిద్ధంగా లేరని, అందువల్లే దేశంలో ఇంధన ధరలు రికార్డుస్థాయిలో ఉన్నాయన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై విధించే వ్యాట్, ట్యాక్స్లు ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉంటోంది. అందుకే ప్రభుత్వాలు వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు సుముఖంగా లేవని వీరు అభిప్రాయపడ్డారు.
జీఎస్టీ గరిష్టం 28 శాతం
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్, ఎక్సైజ్ సుంకం, సెస్, వ్యాట్ ఇలా వివిధ రకాల పన్నులు, ఛార్జీలు విధిస్తుండటంతో లీటర్ పెట్రోల్ పైన రవాణా ఛార్జీలు రూ.3.82, డీలర్ కమిషన్ రూ. 3.67, సెస్ రూ.30గా ఉంటోంది. డీజిల్ పైన రవాణా ఛార్జీలు రూ.7.25, డీలర్ కమిషన్ రూ. 2.53, సెస్ రూ. 20గా ఉంటోంది. అయితే వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే అత్యధికంగా 28 శాతం పన్ను మాత్రమే ఉంటుంది. అప్పుడు వినియోగదారులపై భారం భారీగా తగ్గుతుంది. కస్టమర్లపై రూ.28 వరకు భారం తగ్గి లీటర్ పెట్రోల్ రూ.75 వరకు అవుతుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అన్నారు.
ప్రభుత్వాలకు భారీ నష్టం
చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక లక్ష కోట్ల రూపాయల వరకు నష్టం జరుగుతుందని అంచనా. దేశ జీడీపీలో ఇది 0.4 శాతం. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ధరలను మార్పు చేయకుండా, స్థిరీకరించాలని కూడా ఆర్థికవేత్తలు కోరారు.